రాజధాని బిల్లుల ఆమోదంతో మారుతున్న సమీకరణాలు..ఏపీలో ప్రతిపక్షాలు ఊహించని నిర్ణయం వెలువడింది.
ప్రతీ నిర్ణయంలో ఎదురుదెబ్బ తింటున్న సీఎం జగన్ కు ఈ బిల్లుల ఆమోదం విషయంలోనూ అదే జరుగుతుందని ప్రతిపక్షాలు అంచనా వేస్తూ వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను తిరిగి నియిమించటంతో ప్రతిపక్షాలు తమ విజయంగా భావించాయి. కొద్ది గంటల్లోనే వారి ఆనందం ఆవిరయ్యేలా గవర్నర్ రాజధాని బిల్లులను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో…ఇప్పుడు ప్రధానంగా టీడీపీతో పాటుగా ఇతర ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు. అమరావతి జేఏసీ నేతలు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని…బీజేపీ..గవర్నర్ తీరును తప్పు పడుతున్నారు. కేంద్రం సహకారం లేకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేరంటూ టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. బీజేపీ నేతలు సైతం అమరావతి విషయంలో రోజుకో మాట మార్చుతూ అమరావతి విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయిన తరువాత కొందరు నేతలను కంట్రోల్ చేయటం సైతం వ్యూహంలో భాగంగా వాదిస్తున్నారు. దీంతో..ఇప్పుడు గవర్నర్ తీసుకున్న ఈ గవర్నర్ నిర్ణయం ఏపీలో కొత్త సమీకరణాలకు కారణమవుతోంది.
ఏపీకి గవర్నర్ శాపం..పవన్ బయటకు రావాలి..టీడీపీ..సీపీఐ నేతలు ఇప్పుడు గవర్నర్ ను టార్గెట్ చేసారు. సీపీఐ రామక్రిష్ణ నేరుగా గవర్నర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏపీకి గవర్నర్ శాపంగా మారారంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ..వైసీపీ కలిసి నాటకాలు ఆడుతున్నారని..ఇవి చూసైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు వీడి బయటకు రావాలని రామక్రిష్ణ డిమాండ్ చేసారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నా..వైసీపీతో కలిసి ఏపీలో రాజకీయాలు చేస్తోందని టీడీపీ..సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ..సీఎం జగన్ మధ్య నేరుగా లింకులు ఉన్నాయని..గవర్నర్ సైతం నిమిత్త మాత్రుడేనంటూ చెప్పుకొచ్చారు. కేంద్రం చెప్పిన తరువాతనే గవర్నర్ బిల్లులను ఆమోదించారని విమర్శిస్తున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తామని చెప్పిన జనసేన..ఇప్పుడు గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిమ్మగడ్డ తొలిగింపు సమయంలో ఇదే విధంగా గవర్నర్ సంతకం చేసారని..అది కోర్టుల్లో నిలబడలేదని..ఇప్పుడు అదే జరుగుతుందని జోస్యం చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు టీడీపీ అధినేత స్పందన తెలియాల్సి ఉంది. ఇప్పుడు అమరావతి జేఏసీ..ప్రతిపక్షాలు ఏం చేస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.
బీజేపీ..గవర్నర్ పైన టీడీపీ ఫైర్…గవర్నర్ నిర్ణయం వెలువడిన వెంటనే టీవీ చానళ్లలో టీడీపీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించే సమయంలో ఇప్పటి వరకూ బీజేపీ పైన ఆచితూచి స్పందించిన నేతలు ఒక్క సారిగా స్వరం మార్చారు. కేంద్రంలో బీజేపీ నేతల ఒత్తిడి మేరకే గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించారని ఆరోపిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థ పైనా నిందలు మోపుతున్నారు. రాజస్థాన్ లో గవర్నర్ తీరు..ఇప్పుడు ఏపీ గవర్నర్ తీరు ఒకటే విధంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్టం తో ముడి పడి ఉన్న అంశంలో బిల్లులను రాష్ట్రపతికి పంపకుండా ఎలా ఆమోదిస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ను ఎంపిక చేసిన సమయం నుండే బీజేపీ నాయకత్వం ఏపీలో కొత్త రాజకీయం మొదలు పెట్టిందని వాదిస్తున్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని కాలగర్బం లో కలిపేసారంటూ ఆక్రోశిస్తున్నారు. రాజధాని బిల్లులను ఆమోదించే ముందు వ్యూహాత్మకంగానే ప్రభుత్వం సైతం ఒక మెట్టు దిగి మరీ నిమ్మగడ్డ రమేష్ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించిందని.. ఆ వెంటనే ఇప్పుడు రాజధాని బిల్లులకు రాజ్ భవన్ లో ఆమోదం లభించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతితో ఇంత కాలంగా ఉద్యమం సాగుతుంటే కేంద్రం ఎందుకు స్పందించ లేదని..కేంద్రానికి సంబంధం లేదని ఎలా చెబుతారని సీపీఐ నేతలు ప్రశ్నిస్తున్నారు.