నిర్భయ ఘటన ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగింది. దాన్ని తెలుసుకున్న సమాజం కుతకుత ఉడికిపోయింది. ఫలితంగా ఒక చట్టం వచ్చింది. అదే నిర్భయ చట్టం. అది రావడంతో మంచి జరిగిందా, మానభంగాలు ఆగాయా – అనే ప్రశ్నలున్నాయి. వాటిని అలా ఉండనివ్వండి. ఇది జరిగి ఏడేళ్ళు అవుతున్నా శిక్షలు పడని నిందితులు ఒకవైపు; మరోవైపు మన సమాజంలో స్త్రీలకు భద్రత తగ్గిపోయిందనే ఆందోళన కల్గించే ఘటనలు జరుగుతూనే ఉండటం గమనించవచ్చు. నిర్భయ సంఘటనలో కూడా టెలివిజన్ మాధ్యమం ప్రజాస్పందనకూ, ప్రజాభిప్రాయానికి ఏకైక వేదికగా మారింది. సంఘటన ఢిల్లీలో జరిగింది కనుక అంత ప్రచారం లభించింది అనే వాదన కూడా ఒకటి ఉంది. హైదరాబాదు శివార్లలో నవంబరు 27న జరిగిన దిశ ఘటన సైతం దేశ ప్రజాభిప్రాయ చరిత్రలో ఒక కీలక మలుపుగా ఉండిపోతుంది. దేశ రాజధానిలో జరగకపోయినా దీనికి విశేష ప్రాధాన్యత లభించింది. పార్లమెంటు జరుగుతున్న రోజుల్లో ఇది జరగడం ఇంకో అంశం. ఈ సంఘటన ఈస్థాయిలో ప్రజల దృష్టిలో, నాయకుల దృష్టిలో, అధికారుల దృష్టిలో పడటానికి న్యూస్ ఛానళ్ళే కారణం. న్యూస్ టెలివిజన్ ఛానళ్ళు లేకపోయినా, లేదా ఈ సంఖ్యలో లేకపోయినా పరిణామాలు మరో రకంగా ఉండేవి.
అపరిపక్వ వాదనలుండవచ్చు. అడ్డగోలు వాదనలుండవచ్చు. ఎవరికి తోచింది వారు మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ ప్రజల అభిప్రాయానికి ఒక వాహిక లేదా వేదిక మాత్రం టెలివిజన్ అయ్యింది. నింపాదిగా కాకపోయినా, కాస్తా ఆలోచించి వాదన చేసే వీలున్న పత్రికలు క్రమం పూర్వపక్షం అయిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే టీవీ ఛానళ్ళు బుల్డోజ్ చేస్తున్నాయి. ఈ ప్రక్రియకు సోషల్ మీడియా కూడా ఉపకరిస్తుంది. అరగంట బులెటిన్ లో 3 నిమిషాల ముక్కసరుకుంటే అదే సోషల్ మీడియాలో వందల, వేలసార్లు చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం టెలివిజన్ ప్రాధాన్యత అది.
అది దృశ్యానికున్న బలం, శక్తి! ఆ విషయాలు దృశ్యాల ద్వారా తెలుసుకుంటే తప్పక కుపితులవుతాం. దానికి మీ చదువు, సంస్కారం, సంయమనం కూడా అవరోధాలు కావు. దృశ్యాలకు తోడు వాదనలు మరింత ఆజ్యం పోస్తాయి. లేకపోతే ఎన్ కౌంటర్ జరిగిందనే వార్తతో అభినందనలు, పూల గుచ్ఛాలు, పాలాభిషేకాలు వగైరాలకు కారణం ఏమిటి? మనలోని ఇంగితాన్ని, వివేకాన్ని, ఆలోచనని అధిగమించి ఈ ఉద్రిక్తత ప్రతిస్పందనలు ప్రధానంగా మారిపోయాయి కనుక ఎక్కడికక్కడ ఉరి అవసరమని, ఎవరికి వారు వేయవచ్చు అనే రీతిలో మాట్లాడటం పెరిగింది. అది కూడా ఈ తీర్పుల లాంటి మాటలు పేలుతున్న వారు ఊగిపోవడం, అశ్లీలమైన తిట్లు అలవోకగా పలకడం, టీవీ ఛానళ్ళ ప్రత్యక్ష ప్రసారాలలో ఇవి అలానే వీక్షకులను చేరడం కూడా తెలుగు ఛానళ్ళలో ఈ సంఘటన తర్వాత బాగా పెరిగింది. ఈ ధోరణి టీవీ ఛానళ్ళు టీఆర్ పీలు పెరగడానికి దోహదపడుతోందని ఛానళ్ళ నిర్వాహకులు ఉత్సాహపడుతున్నారు.
ఇలాంటి అమానవీయమైన, దురదృష్టకరమైన సంఘటనలు ఖచ్చితంగా జరగకూడదు. దానికి కారణమైన పేదరికం, స్కూలుకు పంపలేకపోవడం, మద్యం సులువుగా దొరకడం వంటి వాటి గురించి కూడా ఛానళ్ళు చర్చించాలి. అంతేకాదు ఒక అవాంఛనీయమైన సంఘటన జరిగినపుడు లేదా జరుగుతున్నపుడు పట్టించుకోని సమాజం గురించి కూడా మనం చర్చించుకోవాలి. అలాగే అభియోగాలు తొలుత కేసు రిజిస్టర్ చేసే సమయంలోనూ, తర్వాత ఎన్ కౌంటర్తోను విమర్శలు ఎదుర్కొనే పోలీసు శాఖ కూడా ప్రక్షాళన ఎక్కడ జరగాలో ఆలోచించాలి. కనీసం ఇటువంటి వాటి గురించి ఒక ప్రత్యేక, నిరంతర వాహినిగా కార్యక్రమాలు రూపొందించాలి. కార్తీక దీపోత్సవాలు వంటి వాటికన్నా ఇలాంటి వాటిని ప్రత్యేక దృష్టితో ఛానళ్ళు ప్రయత్నిస్తే వాటి గౌరవం పెరుగుతుంది. టీవీ ఛానళ్ళ మీద ఉన్న విమర్శలు తగ్గే అవకాశం ఉంది.
ఇంగితం, తార్కికత, బాధ్యతతో కూడిన టీవీ ఛానళ్ళ ప్రసారాలు పెరగాలని నా ఆకాంక్ష!
డా. నాగసూరి వేణుగోపాల్