సమాచారం వివిధ వ్యక్తుల నుంచి, సంబంధిత వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఒక హేతుబద్ధమైన రీతిలో పత్రికల్లో, రేడియోలో, టీవీలో; పాఠకులకూ, శ్రోతలకూ, వీక్షకులకూ అందిస్తారు. ఇది పరోక్షపద్ధతి. అలాకాకుండా, ఆ వార్తల్లోని వ్యక్తిని నేరుగా కలసి, విషయం చర్చించి, ఒక క్రమ పద్ధతిలో ఇవ్వడం మరింత మెరుగయిన విధానం. ఇది అన్ని వేళలా సాధ్యపడకపోవచ్చు. కానీ ఆ విషయంపై మంచి అవగాహన గలవ్యక్తిని పరిచయం చేసి సమాచారం ఇవ్వడం ఇంకోపద్ధతి. అలాకాక సంబంధిత విషయం సంక్లిష్టమైపుడూ; వివిధ దృక్పథాలు, కోణాలూ ప్రతిఫలించే ప్రజాస్వామ్యపద్ధతిలో ముగ్గురు నలుగురిని కలిపి చర్చచేయడం మరో మెరుగయిన పద్ధతి! ముగ్గురు, నలుగురిని కలిపి సరిగా సమన్వయం చేస్తే – అది మంచి వైవిధ్యంతో రక్తి కడుతుంది.
ఒకటిన్నర దశాబ్దం క్రితం టీవీ-9 రంగ ప్రవేశం చేసినపుడు అది నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో, ప్రయోగాల్లో ఉదయపు పూట చర్చ కూడా ఒకటి. వార్తాపత్రికలు ఆధారంగా జరిగే ఈ కార్యక్రమంలో ఒక జర్నలిస్టు,ఇద్దరు ముగ్గురు రాజకీయనాయకులు లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండడం ప్రణాళిక. ఈనాడు, ఈటీవీ వంటి నిలదొక్కుకున్న సంస్థతో పోటీ చిన్న విషయం కాదని టీవీ-9కు తెలుసు. అందుకే ఒకవైపు వీక్షకులను ఆకట్టుకుంటూనే; పత్రికలలో పనిచేసే జర్నలిస్టులతో ప్రయోగాలు చేశారు. అలా బుల్లితెర మీద కూడా విజయవంతమైన జర్నలిస్టు దేవులపల్లి అమర్. చాలామంది పాత్రికేయులు తెలుగు టెలివిజన్ మీద రాణించడానికి ఈ కార్యక్రమం ఒక ప్రయోగశాలగా మారింది. అలా వచ్చిన ఎంతోమంది పాత్రికేయులు న్యూస్ టెలివిజన్ తెరమీద రకరకాలుగా రాణించారు, రాణిస్తున్నారు.
నిజానికి ఇది ఒక అనివార్యమైన పోకడ. ఎందుకంటే అపుడే ప్రవేశించిన టీవీ జర్నలిస్టులు రిపోర్ట్ చేయగలరు కానీ, చర్చలలో పాల్గొనడం సులువుకాదు. అలాగే వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ వ్యక్తులను పిలిపించడం; వారి పార్టీలకు ఇబ్బంది లేకుండా చర్చలు నిర్వహించడం తమాషాకాదు. వారితో సత్సంబంధాలున్న వ్యక్తులు కూడా ఇక్కడ రాణించారు. కొమ్మినేని శ్రీనివాసరావును ఈ సందర్భంగా మంచి ఉదాహరణగా పేర్కొనవచ్చు. దేవులపల్లి అమర్, కొమ్మినేని శ్రీనివాసరావు ఇపుడు పూర్తిగా టెలివిజన్ లో స్థిరపడినట్టుగా పరిగణించాలి. ఫెమిలియారిటీ అనేది టీవీలో రాణించడానికి చాలా అవసరం, అదే పాపులారిటీ.
వార్తా పత్రికలు ఇచ్చే ప్రధాన వార్తలను సూక్ష్మంగా పరిచయం చేయడం ఆకాశవాణి ఇంగ్లీషు వార్తలలో ఎప్పటి నుంచో వుంది. దూరదర్శన్లో అయితే ఒకరోజు బొంబాయి పత్రికలు; మరుసటి రోజు మద్రాసు పత్రికలు; ఇంకోరోజు కలకత్తా పత్రికలు అనే రీతిలో ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పత్రికా వార్తల సమీక్ష ఉంటూ వచ్చింది. యాజమాన్యపరమైన పాలసీ కారణంగా మిస్సయిన వార్తల ఆచూకీ చెప్పడం అనే ప్రజాస్వామ్య ధోరణిని ప్రతిఫలించడం – ఇక్కడ అసలు ఉద్దేశ్యం.
ఇవన్నీ ప్రణాళికాపరంగా బాగానే ఉన్నాయి. ప్రయివేటు తెలుగు టెలివిజన్ న్యూస్లో ప్రవేశించిన టీవీ-9 2004 ఎన్నికల తర్వాత తన ప్రసారాలలో వార్తల కంటెంటును బాగా తగ్గించినట్లు ప్రకటించి వినోదంపాలు పెంచింది. అప్పటిదాకా సినిమా విషయాలు వార్తల బులెటిన్లో ఉండేవికావు. ఒకవైపు వినోదం, మరోవైపు రాజకీయం అంతర్గతంగా ప్రవేశించడంతోపాటు తక్కువ వ్యవధిలో ఎన్.టీ.వీ., టీ.వీ.-5 కూడా టెలివిజన్ న్యూస్ రంగంలో కాలుమోపి ప్రయోగాలు పెంచాయి. ఈ మూడు సంస్థలకు అంతవరకు మీడియా అనుభవం, చరిత్ర లేవు. అందువల్ల ఏ రకమైన ప్రయోగాలు చేయడానికైనా సమస్యలేకుండా పోయింది. అదే సమయంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రెండు ప్రధాన పత్రికలు పూర్తిగా ఒకే పార్టీవైపు మాట్లాడటం పెరిగిందనే పరిశీలన ఉంది. అందువల్ల తొలి పేజీలో ఏ వార్తలు ఆక్రమిస్తాయో యజమానికి తప్ప సంపాదకుడికి కూడా బోధపడని పరిస్థితి స్థిరపడుతూ వచ్చింది. కొన్ని సందర్భాలలో పూర్తిగా వండిన విషయాలే వార్తలు కావడం; వాటి ఆధారంగా టెలివిజన్లో చర్చలు పొద్దున్నే జరిగి రోజంతా సాగడం పెరిగింది. ఇది రీసైక్లింగ్ వ్యవహారమైపోయింది. దీనికి తోడు తమ పార్టీ వాయిస్ వినిపించాలి. ప్రత్యర్థి పార్టీ గొంతు వినపడకూడదనే రీతిలో టీవీలో పార్టీల ప్రతినిథులు అరవడం కూడా మొదలైంది. ఇంకోవైపు ఈటీవీ, ఆంధ్రజ్యోతి ఛానళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ప్రారంభించలేదు. తమ వార్తల మీద పోస్ట్ మార్టమ్ అక్కరలేదో; ఇతర మీడియా సంస్థల జర్నలిస్టులను ఆహ్వానించడం ఇష్టం లేదో మనకు తెలియదు.
అయితే ఊహా కల్పిత; రాజకీయ ప్రయోజనం, టీఆర్పి దృష్టిగల వార్తల ఆధారంగా ఉదయపు టీవీ చర్చలు కేకలు, పెడబొబ్బలు, అర్థరహిత ప్రేలాపనలుగా విసుగు తెప్పిస్తున్నాయి.
– డా. నాగసూరి వేణుగోపాల్