అమరావతి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుతో శనివారం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి గోపాలరావు అర ఎకరం భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. రాజధాని తరలిపోతోందని మనస్తాపంతో గుండెపోటుకు గురైనట్లు అతని బంధువులు తెలిపారు. గోపాలరావు భౌతికకాయాన్ని రైతు ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు రాజధానిని తరలించవద్దని గత 25 రోజులుగా రైతుల ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. వెలగపూడి రిలే దీక్షలో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో వెలగపూడి గ్రామస్థులు మండుటెండలో దీక్ష కొనసాగిస్తున్నారు.
రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో ఇప్పటి వరకు అమరావతి పరిధిలో ఏడుగురు రైతులు గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం మందడంలో వేమూరి గోపి(20) అనే రైతుకూలీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.