(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ ప్రవాసాంధ్రుల ప్రతినిధులు చంద్రబాబును కలిసి అమరావతి పరిరక్షణ జెఏసి తరుపున సేకరించిన ఎన్ఆర్ఐల విరాళం 7,76,022 రూపాయల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ లండన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల్లో కూడా ఎన్ఆర్ఐలు రాజధాని రైతులకు సంఘీభావ ర్యాలీలు జరపడం అభినందనీయమన్నారు. ఇది ఏ కొందరి సమస్యో, ఒక ప్రాంత సమస్యో కాదని అన్నారు. ఈ మూడు ముక్కలాట మొత్తం రాష్ట్రాన్నే అతలాకుతలం చేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు వెనక్కి పోయాయన్నారు. కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలివెళ్లాయనీ, కొత్త పెట్టుబడులు ఆగిపోయాయనీ పేర్కొన్నారు. ఉపాధి కల్పనకు అడ్డుగోడ కట్టినట్లైయిందని అన్నారు. టిడిపి చేసిన అభివృద్ధి అంతటినీ రివర్స్ చేశారని చంద్రబాబు విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రాజధాని అమరావతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.