అమరావతి: రాష్ట్రంలో వైసిపి నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. సిఎం జగన్ వద్ద నుండే ఈ పరిస్థితి చూస్తున్నామన్నారు. రాజధాని విషయంలో వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుతున్నామే గానీ పరిపాలన వికేంద్రీకరణ కోరడం లేదని చెప్పారు.బిజెపి విధానంలో ఎటువంటి మార్పులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసిపి ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఆయన హితవుపలికారు. రాజధానికి కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు. 151 సీట్లు ఉన్న సిఎం జగన్ అభద్రతాభావంతో ఉన్నారనీ, ఎందుకో తెలియడం లేదనీ కన్నా అన్నారు. రాజధాని రైతులకు సంఘీభావంగా బిజెపి కూడా పోరాడుతుందని ఆయన తెలిపారు. రాజధాని భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగితే అవినీతి పరులపై చర్యలు తీసుకోవచ్చనీ, ఎవరు అడ్డుపడ్డారనీ ఆయన ప్రశ్నించారు. అవినీతి పరులను పక్కన పెట్టి అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని కన్నా అన్నారు.