హైదరాబాద్: సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని దారుస్సలాంలో భారీ బహిరంగ సభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. స్వాతంత్ర లభించిన 70 ఏళ్ల తర్వాత భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎన్ఆర్సీ కల్పిస్తోందని అన్నారు. భారతావని మనదని, మనమంతా భారత పౌరులమని చాటాలని ఈ సందేశం మోదీ సర్కారుకు చేరాలని అసదుద్దీన్ పేర్కొన్నారు.
దేశ ప్రజల మధ్య గాంధీజీ లేకున్నా, ఆయన జ్ఞాపకాలు ఉన్నాయని, అంబేద్కర్ మన మధ్య లేకపోయినా ఆయన రాసిన రాజ్యాంగం మనకు అండగా ఉందని ఒవైసీ చెప్పారు. ఇప్పుడు జరుగుతోంది హిందూ-ముస్లిం, బీజేపీ-మజ్లిస్ మధ్య గొడవ కాదని, దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉందని ఉద్ఘాటించారు.‘ఇది నా దేశం.. నా దేశం కోసం నా ప్రాణాలను సైతం అర్పిస్తా’ అని ఒవైసీ ఉద్వేగంగా ప్రసంగించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా చరిత్ర అందరికీ తెలుసునని ఒవైసీ తెలిపారు. కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ‘గాంధీ, అంబేద్కర్, అబ్దుల్ కలాంలను అవమానించినట్లేనన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్తో తనకు సంబంధం లేదని, అసోంలో ఎంతో మందిపై తూటాలు కురిపిస్తున్నారని, యూపీలో ఒక్కరోజులో 12 మంది మరణించారని అసదుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులెవరూ దేశాన్ని మతం పేరుతో విభజించలేదని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానం దేశాన్ని అస్థిరతకు గురిచేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వార్ధపూరిత ఆలోచనలు మానుకోవాలని సూచించారు.
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత దేశ పౌరులుగా నిరూపించుకోవాల్సి దుస్థితి ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. ముస్లిం పేరు ఎన్ఆర్సీలో లేకపోతే.. అతడి కుటుంబం ఎక్కడికి వెళ్లాలి? అని నిలదీశారు. ఎన్ఆర్సీ వల్ల నష్టమే తప్ప.. ఎలాంటి ప్రయోజనం ఉండదని, రాష్ట్రాలకు రాష్ట్రాలే ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ప్రజలను బీజేపీ రెచ్చగొడుతోందని, ఎన్ఆర్సీ, సీఏఏ వ్యతిరేక ఆందోళనలో ఎక్కడా హింసకు తావు లేకుండా ముస్లింలు జాగ్రత్త వహించాలన్నారు. రాజ్యాంగాన్ని అవమానపరిచేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు అన్నివర్గాలు ఒక్క తాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. తాను బతికి ఉన్నంత వరకు ఎవరికీ అన్యాయం జరుగనివ్వబోనని, యువత భవిష్యత్ కోసం పోరాడుతానని ప్రతిన బూనారు. దేశ ప్రజలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ముస్లింలు, ఆందోళనకారులు అహింసా యుతంగా, శాంతియుతంగా ఆందోళన చేయాలని, హింసకు దిగవద్దని హితవు చెప్పారు.
సీఏఏకు వ్యతిరేకంగా ఓటేసినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. యూనివర్సిటీల్లోకి చొరబడి విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని, బీజేపీతో జగన్ సంబంధం వధులుకోవాలని ఒవైసీ కోరారు. చివరగా..మేమంతా శాంతియుత మార్గంలో ఆందోళనలు నిర్వహిస్తామని సభకు హాజరైనవారితో అసదుద్దీన్ ఒవైసీ ప్రతిజ్ఞ చేయించారు.
Hum bharat ke log… pic.twitter.com/TFJawXq5aq
— Asaduddin Owaisi (@asadowaisi) December 21, 2019
.