అమరావతి: అమరావతిలో మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి అయ్యే పరిస్థితి ఉండగా అవన్నీ వదిలేసి వైజాగ్ లో మళ్ళీ కొత్త భవనాలు కట్టుకుంటామని చెప్పటం, తుగ్లక్ నిర్ణయం కాదా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. శనివారం లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు.
గత మూడేళ్ళుగా అమరావతి నుంచే పరిపాలన సాగుతోందని అన్నారు.అమరావతిలో పరిపాలనకు కావాల్సిన కార్యాలయాల భవనాలన్నీ రూపుదిద్దుకుంటున్నాయనీ, వీటి కోసం, మౌలిక సదుపాయాల పనులు, రోడ్ల నిర్మాణం మొదలయ్యాయనీ పేర్కొన్నారు. విట్, ఎస్ఆర్ఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వచ్చాయన్నారు. రాజధానికి రక్షణ కవచంగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పూర్తి అయిన విషయాన్నీ గుర్తు చేశారు.
‘రాజధాని అంటే నాలుగు బిల్డింగులు కాదు. సకల పాలనా విభాగాలకు కేంద్రం రాజధాని. రాజధానిని కేంద్రం చేసుకుని, దాని చుట్టు పక్కలా, అన్ని హంగులు, వసతులు, సదుపాయాలు సమకూరితేనే, ఒక సిటీ ఏర్పడుతుంది. అమరావతి కూడా అలాగే మొదలైంది’అని లోకేష్ పేర్కొన్నారు.