(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బకెట్ నీళ్లలో లీటరు పాలు కలిపి విద్యార్థులకు తాగేందుకు ఇచ్చిన ఘటన సంచలనమైంది. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పోషకాహారం కోసం విద్యార్థులకు పాలు కూడా ఇవ్వాల్సి ఉంది. అయితే, దాదాపు 81 మంది విద్యార్థులకు ఆ నీళ్ల పాలను గ్లాసుల్లో ఇచ్చారు. ఈ ఘటన సోన్భద్ర జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం (నవంబర్ 27న) జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
విద్యార్థులకు పాలు అందిస్తోన్న సమయంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఒకరు పాఠశాలకు వెళ్లగా.. విద్యార్థులకు నీళ్ల పాలు ఇస్తోన్న విషయాన్ని గుర్తించి, వీడియో తీశారు. ఈ వీడియోలో పాల కోసం విద్యార్థులు వేచి ఉండగా.. వంట మనిషి.. స్టిల్ గ్లాసుల్లో నీళ్ల పాలను పోస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందని ప్రాంతాలలో సోన్భద్ర జిల్లా ఒకటి. చోపాన్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 171 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని పేద కుటుంబాల పిల్లలు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఇచ్చే పోషకాహారంపైనే ఆధారపడతారని సామాజిక కార్యక్తలు అంటున్నారు. అయితే, ఘటన జరిగిన రోజులు ఎక్కువ పాల ప్యాకెట్లను సరఫరా చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాలలో తగినంత పాలు అందుబాటులో ఉన్నప్పటికీ పిల్లలకు పాలు ఎందుకు ఇవ్వలేదనే దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరికీ సరిపడా పాలు పంపిణీ చేయడం లేదనే అరోపణలు వినిపిస్తున్నారు. తనకు ఒక ప్యాకెట్ పాలు మాత్రమే ఇచ్చారని, 81 విద్యార్థులకు వాటిని ఇవ్వాల్సి ఉంటుందని అందుకే తాను నీళ్లు పోయాల్సివచ్చిందని వంట మనిషి తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తోన్న కోట్లాది రూపాయలు దారి మల్లుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
రెండు నెలల క్రితం ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు కూరకు బదులుగా ఉప్పుతో రొట్టెలు తినిపించిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వార్త రాసిన స్థానిక జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేయాలని జర్నలిస్ట్ పవన్ జైస్వాల్ కుట్రపన్నారని అధికారులు ఆరోపించారు.