(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను షాద్నగర్ పోలీస్స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. జైలుకు తరలించే క్రమంలో ఆందోళనకారులు పోలీసు వాహనాలకు అడ్డుగా వచ్చిన నిరసన తెలిపారు. నిందితులను తీసుకెళ్తున్న వాహనాలపై నిరసనకారులు రాళ్లు, చెప్పులను విసిరారు. దీంతో షాద్నగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను జైలుకు తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
అంతకుముందు.. నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించే వీలులేకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్దకే వైద్యులను రప్పించి పరీక్షలు నిర్వహించారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, నిందితులను బయటకు తీసుకురావడం సురక్షితం కాదని భావించిన పోలీసులు.. మేజిస్ట్రేట్ ని కూడా పోలీస్ స్టేషన్ కే రప్పించారు. పీఎస్ లోనే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్ (తహశీల్దార్) నిందితులను విచారించారు. నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను తమకు అప్పగించాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు పీఎస్ ముందు నిరసన దిగారు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిందితులను ఏ జైలుకు తరలిస్తున్నది వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఆ తర్వాత నిందితులను షాద్నగర్ నుంచి నేరుగా చర్లపల్లి జైలకు తీసుకెళ్లారు. నిందితులను తరలించే క్రమంలో దారి పొడవునా భారీగా పోలీసులను మోహరించారు.
షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావటంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. మహిళలు, ప్రజాసంఘాల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంయమనంగా ఉండాలని విజ్ఞప్తి చేసినా నిరసనకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. పోలీసులపైకి చెప్పులు విసరడం, పీఎస్లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.