(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఒక బ్రిటిష్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుంది. చేపలవేట చేసే బోట్తో ఢీకొన్న కారణంగా దర్యాప్తు కోసం ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ చెబుతోంది. స్టెనా ఇంపెరో అనే ఆ ట్యాంకర్లో ఉన్న 23 మంది సిబ్బందిలో 18 మంది భారతీయులు.
ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా తయారయింది. ఇరాన్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల గల్ఫ్లో ఇప్పటికే ఉద్రిక్తత నెలకొనిఉంది. ఇరాన్ రెండు ట్యాంకర్లలను స్వాధీనం చేసుకుందని బ్రిటిష్ విదేశాంగ మంత్రి జెరిమీ హంట్ పేర్కొన్నారు. దీనిని వెంటనే పరిష్కరించకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆయన ఇరాన్ను హెచ్చరించారు.
ఇరాన్ స్వాధీనం చేసుకుందని బ్రిటన్ చెబుతున్న రెండవ ట్యాంకర్పైకి ఇరాన్ సాయుధ జవాన్లు ఎక్కిన మాట నిజమే. అయితే వారు తర్వాత దిగపోయారనీ తమ ట్యాంకర్కు వచ్చిన ప్రమాదమేమీ లేదనీ దాని యజమానులు తెలిపారు.
రెండు వారాల క్రితం బ్రిటిష్ నౌకాదళం ఒక ఇరాన్ ట్యాకర్ను స్వాధీనం చేసుకుంది. సిరియాపై యూరోపియన్ యూనియన్ విధించిన ఆర్ధిక ఆంక్షలను ఉల్లంఘించిందన్నది దానిపై అభియోగం. ఆ ట్యాంకర్ కష్టడీని ఒక జిబ్రాల్టర్ కోర్టు మరో 30 రోజులు పొడిగించిన తర్వాత కొద్ది గంటల్లో బ్రిటిష్ ట్యాంకర్ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది.
Video Courtesy: CBS Television