మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్): ప్రియాంకా గాంధీ పట్టుదలకు ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం తలవంచింది. సోనాభద్ర ఊచకోత మృతుల కుటుంబసభ్యులను కలిసేందుకు ఆమెను అనుమతించింది. అయితే ప్రియాంక సోనాభద్ర వెళ్లకుండా మీర్జాపూర్లో ఆమె ఉన్న గెస్ట్హౌస్ దగ్గరకు వచ్చిన వారిని అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. “మృతుల బంధువులు ఇద్దరిని నన్ను కలవనిచ్చారు. ఇంకా 15 మంది ఉన్నారు. వారిని రానీయడం లేదు. వారి ఆలోచన ఏమిటో దేవుడికే తెలియాలి” అని ప్రియాంక వ్యాఖ్యానించారు. ప్రియాంక అక్కడనుంచి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
శుక్రవారం సోనాభద్ర వెళుతున్న ప్రియాంకను పోలీసులు మీర్జాపూర్ వద్ద నిరోధించారు. అక్కడికక్కడే ధర్నాలో కూర్చున్న ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకుని మీర్జాపూర్లోని చునార్ గెస్ట్హౌస్లో నిర్బంధించారు. రాత్రికి ఆమె అక్కడే గడిపారు.
తనను కలిసిన ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగానికి ఆమె, సోనాభద్ర ఊచకోత బాధితులను కలిసేంతవరకూ తాను కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్ సీనియర్ ప్రభుత్వాధికారులు శుక్రవారం రాత్రి బాగా పొడ్డుపోయిన తర్వాత ప్రియాంకతో పలుమార్లు సమావేశమయ్యారు. అయితే తాను సోనాభద్ర వెళ్లాల్సిందేనని ఆమె స్పష్టం చేయడంతో వారు వెనుదిరిగారు.
“యుపి ప్రభుత్వం వారణాసి అడిషనల్ పోలీసు డైరక్టర్ జనరల్ బ్రిజ్ భూషణ్, కమిషనర్ దీపక్ అగర్వాల్, మీర్జాపూర్ డిఐజిలను నా దగ్గరకు పంపించింది. బాధితులను కలవకుండా వెనక్కి వెళ్లాల్సిందిగా వారు నాకు చెప్పారు. నన్ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పలేదు. నాకు ఎలాంటి పత్రాలూ ఇవ్వలేదు” అని ప్రియాంక అర్ధరాత్రి సమయంలో ట్వీట్ చేశారు.
“నేను చట్టాల్ని ఉల్లంఘించడానికి రాలేదు. బాధితులను పరామర్శించడమే నా లక్ష్యం. అది నెరవేరకుండా వెళ్లేది లేదన్న సంగతి వారికి స్పష్టం చేశాను” అని ఆమె ఇంకొక ట్వీట్లో తెలిపారు. అధికారుల బృందం వెళ్లిపోతున్న వీడియోను కూడా ఆమె పోస్టు చేశారు.
ADG Varanasi, Commissnor Varanasi division and other senior Police & Govt officials leaving Chunar Qila at 1.15 am pic.twitter.com/ceyk4Rg2k0
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2019
మీర్జాపూర్ గెస్ట్హౌస్లో కరంటు పోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి చీకటిలో కూర్చున్న ప్రియాంకా గాంధీ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ప్రియాంకను అక్కడి నుంచి పంపించేందుకు అధికారులే కరెంటు ఆపారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు.
గత బుధవారం సోనాభద్ర వద్ద ఉంభా గ్రామంలో భూమి తగాదాలో గ్రామ ప్రధాన్, అతని అనుచరులు గ్రామస్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పది మందిని పొట్టన బెట్టుకున్నారు. ఈ కాల్పుల్లో 24 మంది గాయపడ్డారు.
ఈ ఊచకోత సంభవించిన రోజున ప్రియాంకా గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బిజెపి ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్లో నేరస్థులకు ఎంత దమ్ము వచ్చిందంటే పట్టపగలు హత్యాకాండ అడ్డూఆపూ లేకుండా కొనసాగుతోంది అని ఆమె వ్యాఖ్యానించారు.