(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దిశ కేసులో జరిగిన న్యాయం.. తన కుమార్తె విషయంలో జరగలేదని దివంగత నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి అన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యూష తల్లి మీడియాతో మాట్లాడారు. దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలపారు. 17 సంవత్సరాల క్రితం తన కుమార్తెను దారుణంగా హత్యాచారం చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో ఇంత టెక్నాలజీ, ప్రజల్లో ఇంత చైతన్యం, పోరాట పటిమ ఉండి వుంటే, తనకు కూడా న్యాయం జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రత్యూష కేసును ప్రస్తుతమున్న నిర్భయ చట్టాల పరిధిలోకి తీసుకుని వచ్చి, మరోసారి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆత్యాచార నేరస్తులకు పడే శిక్షలపై చట్టాలను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. దిశ పేరుతోనే ఒక చట్టం తీసుకొస్తే , స్త్రీలకు మరింత రక్షణ ఉంటుదని సరోజినీ దేవి పేర్కొన్నారు.
నటి ప్రత్యూష 2002, ఫిబ్రవరి 23న అనుమానాస్పద స్థితిలో మరణించగా.. కొందరు ఆత్మహత్యగా సృష్టించాలని ప్రయత్నించారని ప్రత్యూష తల్లి సరోజనీదేవి ఆరోపించారు. సిద్ధార్థరెడ్డితో ప్రేమ వ్యవహారంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ప్రత్యూషను మూడుసార్లు అత్యాచారం చేసి విషం తాగించి చంపేశారసి పేర్కొన్నారు. అయితే, ప్రత్యూష మృతి మిస్టరీపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రత్యూషది హత్యా ? ఆత్మహత్యా ? అన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.
ఈ కేసులో ప్రత్యూష బాయ్ఫ్రెండ్ సిద్దార్థ్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ న్యాయస్థానం శిక్షను ఖరారు చేయగా.. తన శిక్షను తగ్గించాలంటూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యూష తల్లి సరోజిని, సిద్దార్థ్కు శిక్ష తగ్గించొందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును నిర్భయచట్టం కిందకు తీసుకురావాలని ఆమె విఙ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.