(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మార్కెట్ లో కూరగాయల ధరలు మండుతున్నాయి. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర బాటలో ఇప్పుడు టమాటా కూడా పయనిస్తోంది. వారం రోజుల క్రితం 10 రూపాయలు ఉన్న కిలో టమాటా ఇప్పుడు ఏకంగా రూ.40-50 పలుకుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాయ, పూత రాలిపోయి దిగుబడి ఒక్కసారిగా తగ్గడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి దిగుమతి అవుతున్న టమాటాలే హైదరాబాద్ అవసరాలను తీరుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. దీంతో మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి టమాటాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకోసం లారీ కిరాయికే పదివేల రూపాయలు చెల్లిస్తున్నారు. దీంతో టమాటా ధరను రూ.50కి పెంచి అమ్మాల్సి వస్తోందని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మరో వారం రోజుల్లో దిగుబడి పెరిగే అవకాశం ఉందని, అప్పటి వరకు ధరలకు కళ్లెం వేయడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల తాత్కాలికమేనని, వర్షాలు ఆగిన వెంటనే ధరలు దిగి వస్తాయని పేర్కొన్నారు.
మరోవైపు వర్షాల కారణంగా కొన్ని రకాల కూరగాయలపై మచ్చలు ఏర్పడి.. నాణ్యత దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. దీంతో మార్కెట్లో గిట్టుబాటు ధర లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఉల్లిగడ్డ ధర కూడా పైపైకి ఎగబాకుతూనే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.60-70 మధ్య పలుకుతోంది. దీంతో ఉల్లి కొనక ముందే ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. మొత్తం మీద పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యుడిపై భారం పెరుగుతోంది. దీంతో టమాటాలు కొనడానికి సామాన్యులు ఆలోచిస్తున్నారు. కూరగాయల ధరలు ఇంతలా పెరిగిపోతే ఇంకేం తిని బతుకుతామని సగటు జనం వాపోతున్నారు.