బిజ్నోర్: ఉత్తరప్రదేశ్ లో ఓ టిక్ టాక్ కిల్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిజ్నోర్ జిల్లాలో ముగ్గరు వ్యక్తులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 ఏళ్ల అశ్వని కుమార్ అలియాస్ ‘జానీ దాదా’ అనే వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యల అనంతరం పరారీలో ఉన్న కుమార్.. సోషల్ మీడియాలో పలు పోస్టులు చేశాడు. తనను అవమానించిన వారిని చంపుతానని ఫేస్ బుక్, టిక్ టాక్ వీడియోల్లో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 26న స్థానిక బీజేపీ నాయకుడు భీమ్ సింగ్ కశ్యప్ కుమారుడు చంద్ర భూషణ్, అతని బంధువు లాలాను కుమార్ కాల్చి చంపాడు. సెప్టెంబర్ 30న నికితా శర్మ అనే మాజీ ఎయిర్ హోస్టస్ ని తన ఇంట్లోనే కాల్చి హత్య చేశాడు. అనంతరం దౌలతాబాద్ అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. దీంతో కుమార్ ను పట్టుకునేందుకు పోలీసులు అడవిలో గాలించినప్పటికీ అతను చిక్కలేదు.
బిజ్నోర్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జానీ దాదా తన వద్దనున్న తుపాకీ తీసుకుని, తనను తాను కాల్చుకున్నాడని బిజ్నోర్ ఎస్పీ సంజీవ్ త్యాగి తెలిపారు. ‘శనివారం తెల్లవారుజామున బాదాపూర్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ బస్సులో డ్రైవర్ పక్కనే కూర్చున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ఆ వ్యక్తిని పోలీసు కానిస్టేబుల్ ప్రశ్నిస్తుండగా.. ఇంతలో సదరు వ్యక్తి రివాల్వార్ బయటకు తీసి తనను తాను కాల్చుకున్నాడు. అనంతరం మృతి చెందిన వ్యక్తి మోస్ట్ వాంటెడ్ జానీ దాదాగా గుర్తించాం ’ అని ఎస్పీ త్యాగి వివరించారు.
ఆదిత్య రాజ్ పూత్ పేరుతో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జానీ దాదా.. టిక్ టాక్ వీడియోలు భీభత్సం సృష్టించాయి. అతనితో ఎవరైన తగువు పెట్టుకుంటే..వారినే తన తర్వాత టార్గెట్ గా పెట్టుకుంటాడని పోలీసులు తెలిపారు. ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాడని చెప్పారు. వీటికి సంబంధించిన పోస్టులను ఫేస్ బుక్, టిక్ టాల్ వీడియోలో గుర్తించామని వెల్లడించారు. ‘నేను కోపంగా ఉంటే చంపడానికి వెళ్తాను’ లాంటి పోస్టు ఉన్నాయని పోలీసులు తెలిపారు.