(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పోలవరం ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అవరోధాలు ఎదురయ్యాయి. అనునయంగా చెప్పినా వినకుండా పోలవరం నిర్మాణంలో రివర్స్ టెండరింగ్కు నోటిఫికేషన్ జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మొత్తం వ్యవహారంపై వివరమైన నివేదిక సమర్పించాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించింది.
మరో పక్కన తమ కాంట్రాక్ట్ రద్దు చేయడాన్ని నవయుగ సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఇందులో కేంద్ర ప్రభుత్వం మాటే అంతిమమని నవయుగ వాదిస్తున్నది. అదెలా ఉన్నా తమ కాంట్రాక్ట్ జెన్కోతో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదని కూడా నవయుగ పిటిషన్లో పేర్కొన్నది.
ఇవి రెండూ కూడా జగన్ ప్రభుత్వం దూకుడుకు గట్టి అవరోధాలే. వీటిని జగన్ ఎలా అధిగమిస్తారన్న ప్రశ్న వచ్చినప్పుడు దాని కన్నా ముందు ఇలాంటి అవరోధాలు వస్తాయని ముఖ్యమంత్రి ముందుగా ఊహించారా లేదా అన్న ప్రశ్న ఎదురవుతుంది.
వైసిపి ప్రభుత్వం పట్ల మోది ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉంటుందన్న భ్రమలు ఎవరికీ లేవు. జగన్ ప్రధాని ముందు ఎంత వినమ్రంగా వ్యవహరించినా నలుగురి ముందు ప్రధాని జగన్ను ఎంత వాత్సల్యంగా పలకరించినా అంతా పైపైకేనని అందరికీ తెలుసు. మోది ప్రభుత్వం తన నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందనీ, ఎంత తగ్గి ఉన్నా రాష్ట్రంలో మోది, అమిత్ షా వ్యూహం అమలు కాక తప్పదనీ జగన్కు కూడా స్పష్టంగా తెలుసు.
మరి ఏ ధైర్యంతో జగన్ మొండిగా ముందుకు వెళ్లారు? అటు పవర్ పర్ఛేజి అగ్రిమెంట్ల విషయంలో కానీ, ఇటు పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో కానీ ఈ వైఖరి తగదని కేంద్రం ఒకటికి రెండు సార్లు చెప్పింది. ముఖ్యమంత్రి అయినా తన వైఖరి మార్చుకోలేదు. ఆగస్టు 15న పతాక ఆవిష్కరణ అనంతరం ప్రసంగిస్తూ ప్రాజెక్టులలో అవినీతిని పరిహరించేందుకు ప్రయత్నిస్తుంటే, ప్రజలకు విద్యుత్ తక్కువ ధరకు ఇచ్చేందుకు కృషి చేస్తుంటే కొందరికి గిట్టడం లేదని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ నైజం తెలిసిన వారికి ఆయన పట్టుదల ఆశ్చర్యం కలిగించదు. కానీ అవతల ఉన్నది మోది నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అయినప్పటికీ మొండిగా ముందుకు వెళ్లడం కొంత అశ్చర్యంగానే ఉంది. అందువల్లనే ముఖ్యమంత్రి జగన్ ధైర్యం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతున్నది.