(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఆంధ్రప్రదేశ్లో వీలైనంత త్వరగా చక్రం తిప్పాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు కనబడుతోంది. ఆ పార్టీ నాయకత్వం వేస్తున్న ప్రతి అడుగూ వారు ఎంత తొందరలో ఉందీ సూచిస్తున్నది.
ఇప్పుడు బిజెపి నాయకులు టిడిపిపై విమర్శలు చేయడం లేదు. అవకాశం దొరికిన ప్రతిసారీ అధికారపక్షంపై ధ్వజం ఎత్తుతున్నారు. టిడిపిని బలహీనం చేసి ఆ స్థానాన్ని తాము ఆక్రమించాలన్నది బిజెపి గేమ్ప్లాన్. మరి టిడిపి బలహీనం అయినంతమాత్రాన సరిపోదు కదా. సమాంతరంగా వైసిపిపై ప్రజావ్యతిరేకతను పెంచాలి. అందుకే వైసిపికి వ్యతిరేకంగా బిజెపి నేతల స్వరం హెచ్చుతున్నది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చాలా రోజుల నుంచీ వైసిపిపై విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వైసిపి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. టిడిపి ప్రభుత్వం పోలవరంలో అవినీతికి పాల్పడిందని పదేపదే ఆరోపించిన వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు ఆయన రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడారు. ప్రధానమంత్రి శంఖుస్థాపన చేసిన రాజధాని ఎక్కడికీ పోదని ఆయన తనను కలిసిన రైతులకు హామీ ఇచ్చారు. రాజధాని తరలించాలని చూస్తే తమ పార్టీ అమరావతి రైతుల పక్షాన పోరాడుతుందని ఆయన అన్నారు.
అమరావతి విషయంలో బిజెపి ముఖ్యనేత ఒకరు ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే ప్రధమం. రాజధాని విషయంలో మంత్రులు రోజుకొక రకంగా మాట్లాడి అయోమయాన్ని సృష్టిస్తుండడంతో అమరావతి విషయంలో తీవ్రమైన సందిగ్ధత నెలకొన్నది. మరోపక్కన హైకోర్టును తమ ప్రాంతానికి తరలించాలంటూ అటు రాయలసీమలో, ఇటు ఉత్తరాంధ్రలో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారు. హైకోర్టును ఉన్నచోటే ఉంచాలంటూ కోస్తా న్యాయవాదులు కూడా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు.
ఈ నేపధ్యంలో రాజధానిగా అమరావతి కొనసాగింపు విషయంలో బిజెపి నాయకుడు రాంమాధవ్ వైసిపితో తలపడడానికి సిద్ధం అనే విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కేంద్రం సహయం లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధాని విషయంలో ముందుకువెళ్లడం కష్టం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాంమాధవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని బిజెపి దేశవ్యాప్తంగా చేపట్టిన సంకల్ప్ యాత్ర విషయంలో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్కు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. గత వారం రోజుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కనీసం ఒక కేంద్ర మంత్రి సంకల్ప్ యాత్రలో పాల్గొన్నారు.
టిడిపి నుంచి, వైసిపి నుంచీ వీలైనంత మందిని ఆకర్షించడం ద్వారా కార్యకర్తల అండఉన్న నాయకులను సంపాదించడం, పార్టీ బలపడిందనుకున్న తర్వాత వైసిపికి చెక్ పెట్టడం బిజెపి వ్యూహంగా చెబుతున్నారు. ఈ చెక్ ఎలా ఉంటుదన్న దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. సిబిఐ కోర్టులో ప్రతి శుక్రవారం హాజరు నుండి మినహాయింపు కోరుతూ సిఎం జగన్ పెట్టుకున్న పిటిషన్ను సిబిఐ వ్యతిరేకించిన తీరు చూసిన తర్వాత, ఆయనను బిజెపి మళ్లీ జైలుకు పంపినా ఆశ్చర్యం లేదని చాలామంది అనుకుంటున్నారు.