అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పిపిఏ) విషయంలో జగన్మోహనరెడ్డి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తామని చెబుతూనే తాము అనుకున్న దారి నుండి పక్కకు వెళ్లే ప్రశ్నలేదని సూచిస్తోంది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటన ఈ వాదానికి బలం చేకూర్చే విధంగా ఉంది.
ఒక పక్క ఇప్పటికే అమలులో ఉన్న పిపిఏలను పునః సమీక్షించబోమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరో పక్క నిబంధనలకు విరుద్దంగా, వాస్తవ ధరలకన్నా ఎక్కువ ధరలకు కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పకుండా సమీక్షిస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ఒక మెట్టు ఎక్కడం తప్ప దిగడం ఉండదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం బతికి బట్టకట్టాలంటే ప్రక్షాళన తప్పనిసరి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో ఒప్పందాలు చేసుకుని ఖజానాకు నష్టం కలిగించారని మంత్రి బాలినేని ఆరోపించారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. పిపిఏల పునః సమీక్షపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖలు రాయడం, కొన్ని పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థలు కోర్టును, ట్రిబ్యునల్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏమైనా అవకతవకలు జరిగితే తప్ప, ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాలను పునః సమీక్షించబోమని రాష్ట్రం స్పష్టం చేసింది. ఇంకా ఖరారు కాని ఒప్పందాలపైనే దృష్టి సారిస్తామని కేంద్రానికి రాసిన లేఖలో వివరించింది.
లేఖలోని అంశాలు గానీ మంత్రి ప్రకటన గానీ చూస్తే ప్రభుత్వం పిపిఎల విషయంలో ఎవరి మాటలు వినదనీ, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సులనే పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగుతుందని భావించాల్సివస్తోంది.