వెల్లడించిన ఫరీదాబాద్ మహిళ
సాయమే చేశానన్న బీజేపీ ఏజెంటు
ఫరీదాబాద్: పోలింగ్ కేంద్రంలో ఏజెంటుగా విధులు నిర్వర్తించాల్సిన వ్యక్తి ఏకంగా ఈవీఎం వద్దకు వెళ్లి మహిళలతో ఓటు వేయించిన ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. ఫరీదాబాద్ ఘటనలో అరెస్టయిన బీజేపీ ఏజెంటు గిరిరాజ్ సింగ్ కొన్ని గంటల తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు. అతడు తమను కమలం గుర్తుకే ఓటేయమన్నాడని ఆ రోజు ఓట్లు వేయడానికి వచ్చిన మహిళలు చెబుతుంటే, గిరిరాజ్ సింగ్ మాత్రం దాన్ని ఖండించాడు. గ్రామంలోని నిరక్షరాస్యులైన మహిళలకు సాయం చేయడానికి మాత్రమే తాను ప్రయత్నిస్తున్నానని అతడు అన్నాడు. ఫరీదాబాద్ లోక్ సభకు సంబంధించి 28 మంది అభ్యర్థులుండటంతో రెండు ఈవీఎంలు పెట్టారని, గ్రామంలో మహిళలు నిరక్షరాస్యులని అన్నాడు. చదువుకున్నవారు కూడా రెండు ఈవీఎంలు చూసి కాస్త గందరగోళానికి గురయ్యారని, అందుకే తాను వాటిని ఎలా వాడాలో చెప్పానని తెలిపాడు.
ये विडियो किसी ने भेजा है और हरियाणा के फरीदाबाद का होने का दावा किया है| इससे क्या फर्क पड़ता है कि ये कब का और कहाँ का है? लेकिन हैरान और दुखी हूँ ये देखकर कि सिस्टम कई बार कितना नपुंसक हो जाता है? ये नीच हरकत है? pic.twitter.com/R8SRQ6U5aP
— Anurag Dhanda (@anuragdhanda) May 12, 2019
అయితే, ఈ విషయంలో వచ్చిన ఫిర్యాదులను వాస్తవమని తెలుసుకున్న ఎన్నికల సంఘం.. ఆ పోలింగ్ కేంద్రంలో మే 19న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. దాంతోపాటు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు అధికారులపై చర్యలు ప్రారంభించింది. గిరిరాజ్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రిసైడింగ్ అధికారి అమిత్ అత్రిని సస్పెండ్ చేశారు. ఆయనపై క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభించారు. మైక్రో అబ్జర్వర్ సోనల్ గులాటీని మూడేళ్ల పాటు ఎన్నికల విధుల నుంచి బహిష్కరించింది. ఈ ఘటనను సరిగ్గా రిపోర్టు చేయనందుకు ఈ చర్య తీసుకున్నారు. రిటర్నింగ్ అధికారిని వెంటనే బదిలీ చేశారు. కొత్త రిటర్నింగ్ అధికారిగా ఐఏఎస్ అధికారి అశోక్ కుమార్ గార్గ్ ను నియమించారు.
నా ఇష్టమని చెప్పా.. వెళ్లిపోయాడు
ఈ ఘటనతో సంబంధమున్న మహిళల్లో ఒకరిని ఎన్డీటీవీ ప్రతినిధులు గుర్తించి, ఆమెను ఏమైందని ప్రశ్నించారు. గిరిరాజ్ సింగ్ తనను బీజేపీ ఎన్నికల గుర్తయిన కమలానికి ఓటేయాలని చెప్పాడని, అయితే తాను మాత్రం ఓటు తన ఇష్టమని చెప్పడంతో అతడు వెంటనే వెళ్లిపోయాడని ఆ గ్రామానికి చెందిన శోభ చెప్పారు. తాను తనకు నచ్చిన వారికి ఓటేసి, అక్కడినుంచి వచ్చేశానన్నారు. తన కూతురికి ఆరోగ్యం బాగోకపోవడంతో వెంటనే వచ్చేశానని, అందుకే ఎవరికీ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.