ముంబై: మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేతో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫొటోలను కూడా ముద్రించారు. బాల్ఠాక్రే, ఇందిరా గాంధీ ఒకరికి ఒకరు అభివాదం చేసుకునే ఫొటోలతో పోస్టర్లు వేయించారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు ఉద్దండుల ఫొటోలు ఒకే పోస్టర్పై కనిపించడం అందరిని ఆకర్షిస్తున్నాయి. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే తొలిసారి ముఖ్యమంత్రి పీటం ఎక్కబోతున్న తరుణంలో ముంబైసహా రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టర్లు వెలిశాయి.
బాల్ ఠాక్రే, ఇందిరా గాంధీ జీవించి ఉన్నప్పడు ఇద్దరూ ఒకరికి ఒకరు మద్దతుగా నిలిచారు. 1975లో దేశమంతా వ్యతిరేకించిన అత్యవసర పరిస్థితిని ఠాక్రే సమర్థించారు. ఇప్పుడు ఇలా వీరిద్దరి ఫొటోలు అందరిని ఆకర్షిస్తున్నాయి. మరాఠా యోధుడిగా పేరుగాంచిన బాల్ ఠాక్రే 2012లో కన్నుమూశారు.
మరాఠీల అభ్యున్నతి కోసం 1966లో శివసేన పార్టీని బాల్ ఠాక్రే స్థాపించారు. 20 ఏళ్ల తర్వాత శివసేన పార్టీ తొలిసారి అధికారం చేపట్టబోతోంది. ఠాక్రే కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో పాటు ఆయన కుటుంబం తొలిసారిగా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇప్పటివరకూ ఉద్ధవ్ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కుమారుడు, ఆదిత్య ఠాక్రే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నుంచి పోటీచేసి గెలిచారు. అంతేకాదు ఠాక్రే కుటుంబం నుంచి చట్టసభలో అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు సీఎం కాబోతున్న ఉద్ధవ్ ఆరు నెలల్లో అసెంబ్లీకి గానీ, శాసనమండలికి గానీ ఎన్నిక కావలసి ఉంది.