ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించిన రాష్ట్ర గవర్నర్.. తమ బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరిండచిన బీజేపీకి.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 145 మంది సభ్యుల బలం మాత్రం లేదు. శివసేన మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం. అయితే, అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా శివసేన వైఖరి ఏమిటి అన్నది సస్పెన్స్ గా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఆదివారం బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో చర్చింనున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లలో బీజేపీ, శివసేనకు కలిపి 161 సీట్లు వచ్చాయి. అయితే, తమకు రెండున్నరేళ్లు సీఎం పదవి కావాలని శివసేన డిమాండ్ చేయడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. దీంతో అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా శివసేన ఎలాంటి వైఖరి అనుసరిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది.
మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శివసేన జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా వారిని ముంబైలోని ఓ హాటల్ కు తరలించింది. శివసేన తన ఎమ్మెల్యేలను గురువారమే రిసార్ట్స్కు తరలించింది. మరోవైపు కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను జైపూర్కు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందనే సమాచారంతో వారిని శిబిరాలకు తరలిస్తున్నారని పార్టీ వర్గాల్లో నడుస్తోంది. సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలంటూ గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న శివసేన.. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉంది. 50: 50 ఫార్ములాపై ఎన్నికలకు ముందు జరిగిన చర్చల్లో అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని బీజేపీ చెబుతుండగా, సాక్షాత్తూ అమిత్ షా హామీ ఇచ్చారని శివసేన వాదిస్తోంది. తమకు సీఎం పదవి ఇచ్చేందుకు ఒప్పుంకుంటేనే సంప్రదింపులకు రావాలని బీజేపీకి తేల్చి చెప్పింది. దీంతో పీటముడి వీడలేదు.
ఇదిఇలా ఉందే.. శివసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ ముందున్న మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసింది. అయితే, తాము ప్రతిపక్షంలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ – శివసేన కలసి సర్కారు ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే, తాజాగా శరద్పవార్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా శివసేన బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రత్యామ్నాయ ప్రభుత్వం గురించి అప్పుడు ఆలోచిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బలపరీక్ష అంటూ జరిగితే తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. శివసేన కూడా వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించారు.
శివసేన వ్యతిరేక ఓటుతో బలపరీక్షలో బీజేపీ విఫలమైతే శివసేన-ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని, కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో శరద్పవార్ భేటీ కానుండడంతో ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. గత 15 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, క్యాంపు రాజకీయాలతో మరింత వేడెక్కింది.