ముంబై దేశంలో ఇంత బాహాటంగా విద్వేషం రాజ్యం ఏలడం చాలా ఆందోళనకరమైన విషయమని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా పేర్కొన్నారు. తాను తన అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నందుకు రకరకాల వ్యక్తుల నుంచి దూషణలు ఎదురయ్యాయనీ, వాటి గురించి తాను బాధ పడేది లేదనీ ఆయన అన్నారు.
ఆదివారం ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నసీరుద్దీన్ షాను మీడియా పలకరించింది. మూకదాడుల సంస్కృతి పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు రాజద్రోహం కేసు ఎదుర్కొన్న 49 మంది మేధావులకు మద్దతుగా మరో బహిరంగ లేఖ రాసిన సాంస్కృతిక కళా రంగాలకు చెందిన 180 మంది ప్రముఖులలో నసీరుద్దీన్ షా ఒకరు.
దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులలో అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించగలిగే ధైర్యం ఎక్కడనుంచి వచ్చిందని ఒక విలేఖరి ప్రశ్నించారు. దీని వల్ల సినిమా అవకాశాలు తగ్గాయా అని కూడా ఆ విలేఖరి అడిగారు. సినిమా అవకాశాలు తగ్గాయా అన్న ప్రశ్నకు తనకు సమాధానం తెలియదని షా చెప్పారు.
ప్రజల నుంచి మాత్రం చాలా దూషణలు ఎదురయ్యాయనీ, అయితే చెప్పాలనుకున్న దానిని చెప్పకుండా ఉండలేననీ నసీరుద్దీన్ షా అన్నారు. వ్యక్తిగత దూషణలు తనను బాధపెట్టవనీ, దేశంలో విద్వేషం బాహాటంగా రాజ్యమేలడం మాత్రం తనకు ఆందోళనకరంగా ఉన్నదనీ ఆయన పేర్కొన్నారు.