అమరావతి, మార్చి 5 : అహంకారం నెత్తికెక్కి టిఆర్ఎస్ విపరీత చేష్టలకు పాల్పడుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వ్యక్తికైనా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి.. అలాంటి ఆస్తికి హైదరాబాద్లో రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. పిల్లచేష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు నష్టం కలిగిస్తున్నారనీ, ఎవరైనా సమాచారాన్ని ఇకపై హైదరాబాద్లో పెడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… అహంభావంతో కేసిఆర్, అసహనంతో జగన్ దుర్మార్గాలకు పాల్పుడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏ పార్టీకి లేని సాంకేతికత టిడిపి సొంతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టిడిపి 24 ఏళ్లు కష్టపడి కార్యకర్తల సమాచారం సేకరిస్తే దానిని దొంగిలించి వైకాపాకి ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ సమాచారమని అసత్య ప్రచారం చేస్తున్నారనీ, టిడిపి సమాచారం కొట్టేసి పార్టీపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపి ఓడిపోతుందని చెప్పటానికి కేటిఆర్ ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. మోది, కేసీఆర్, జగన్ ముసుగు తీసి ప్రచారం చేయాలనీ, ప్రజలే మీ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు అన్నారు. కేసిఆర్ సామంత రాజుగా జగన్ మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ని సామంత రాజ్యం చేయాలనేదే కేసిఆర్ కుట్ర అని చంద్రబాబు అన్నారు. జగన్ను లొంగదీసుకుని ఏపీపై దాడులకు తెగబడ్డారని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మూలాలపై దాడులు చేయడం హేయమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఫారమ్ 7 దుర్వినియోగం చేయడం నేరమని చంద్రబాబు పేర్కొన్నారు. తప్పుడు పనులతో ఓట్ల తొలగింపుకు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నేరస్థుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటాయని చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులో నాలుగు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జగన్ అరాచకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఓట్ల తొలగింపు, కుల రాజకీయాలు, ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వైకాపా తప్పుడు విధానాలను ఎండగట్టాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రేపు ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు.