న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ప్రయోగం ఆఖరి నిమిషంలో విఫలమైనప్పటికీ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రుడిపై ప్రయోగాల కోసం చేపట్టనున్న చంద్రయాన్-3కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. బుధవారం(జనవరి 1) ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన పనులన్నీ సజావుగా జరుగుతున్నాయని వెల్లడించారు. చంద్రయాన్-2 మాదిరిగానే చంద్రయాన్-3 ఉంటుందని శివన్ తెలిపారు. చంద్రయాన్-2లో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. చంద్రయాన్-3లో ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్ రోవర్ ఉంటాయని వివరించారు. చంద్రయాన్-2 ద్వారా ఇస్రో మంచి ఫలితాలను సాధించిందని తెలిపారు. చంద్రుడిపై దిగడంలో ల్యాండర్ చివరి క్షణంలో విఫలమైనప్పటికీ… ఆర్బిటర్ మాత్రం అద్భుతంగా పని చేస్తోందని చెప్పారు. మరో ఏడేళ్ల పాటు అది పని చేస్తుందని, సైంటిఫిక్ డేటాను పంపిస్తుందని తెలిపారు. 2020లో చంద్రయాన్-3, గగన్యాన్ ప్రయోగాల కోసం పని చేస్తామన్నారు.
చంద్రయాన్-2 సందర్భంగా ల్యాండర్ విఫలం కావడంతో తాను మానసికంగా చాలా కదిలిపోయానని… ప్రధాని మోదీ తనను హత్తుకోవడం ఊరట కలిగించిందని తెలిపారు. గగన్ యాన్ మిషన్ విషయంలో కూడా మంచి పురోగతి ఉందని శివన్ చెప్పారు. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు భారత్ తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రయోగం కోసం.. నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశామని చెప్పారు.. వీరికి జనవరి మూడో వారంలో శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని శివన్ తెలిపారు. ఈ నలుగురు వ్యోమగాములు పురుషులని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినవారని వెల్లడించారు. వీరికి రష్యాలో శిక్షణ ఉంటుందని చెప్పారు. తమిళనాడులోని తూత్తుకుడిలో రెండో స్పేస్ పోర్టును నెలకొల్పబోతున్నామని… దీనికి సంబంధించి భూసేకరణ కార్యక్రమం కొనసాగుతోందని శివన్ తెలిపారు.