అమరావతి: రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని దీక్ష చేస్తోన్న రైతులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల కల అమరావతి అని, ఇక్కడే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం తెలపడానికి నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తే ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు తాము కూడా ఇలాగే ముళ్ల కంచెలు అడ్డుపెడితే ఎలా తన యాత్రను ఎలా కొనసాగించేవారని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ పొలాల్లో నడుచుకుంటూ వెళితే ప్రజలే కాపాడి మందడం వరకూ తీసుకెళ్లారని చెప్పారు. రైతుల కష్టాలు వింటుంటే బాధేస్తోందన్నారు. అమరావతి గ్రాఫిక్ చూపించామని వైసీపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఇక్కడి రహదారులు, భవనాలు వారికి కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. రూ.10వేల కోట్లు ఖర్చుపెడితే.. ఏం లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని వల్ల సంపద, దాని వల్ల పేదలకు ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. కానీ, జగన్ తన చేష్టలతో సంపద రాకుండా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. యువతకు జగన్ కనీసం స్కాలర్ షిప్ లు కూడా ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రానికి రాజధాని ఉండాలని నాడు రైతులు త్యాగం చేశారని, తన పిలుపునకు స్పందించి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం, సాగర్లో నీళ్లు నింపి.. తన ఇల్లు ముంచాలని కుట్ర చేశారని చంద్రబాబు ఆరోపించారు. అయితే తన ఇల్లు మునగలేదని, కానీ లంక గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయని చెప్పారు. అమరావతికి నీటిముంపు లేదని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో ముంపు లేదని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. ‘’అమరావతి ప్రాంతానికి కృష్ణా నది నుంచి ముప్పు లేదు. ఉన్నదల్లా కొండవీటి వాగు నుంచే. ఆ వాగుపై కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాము. ఇప్పుడు జగన్ ముందున్న సమస్య ఏంటి? అసమర్థ అధికారి జీఎన్రావుతో కమిటీ వేశారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ పోర్చుగల్లో ఫోర్జరీ చేస్తే వాళ్లపై ఎఫ్బీఐ విచారణ జరుగుతోంది. ఇప్పుడేమో సూపర్ హైపవర్ కమిటీ అంటున్నారు. వీళ్లా రాజధానిని నిర్ణయించేది ? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు. వారంతా రాజధానులు మార్చారా? ” అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా? అని నిలదీశారు.
రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. తన కులం, మనుషుల కోసం ఆలోచిస్తే హైదరాబాద్ను అభివృద్ధి చేసేవాడిని కాదని, ఒకే సామాజికవర్గం కోసం అమరావతి చేపట్టారని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్, బెంగళూరు కంటే అమరావతి నిర్మాణానికి తక్కువ వ్యయాన్ని ఖర్చు చేశామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజల కోసమే నాడు ఎంతో కష్టపడ్డానని, ఐటీ దిగ్గజం బిల్గేట్స్ లాంటి ప్రపంచ మేధావులను హైదరాబాద్కు తీసుకొచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. ‘అక్కడ పనిచేస్తున్నది నా మనుషులా? నాకులం వాళ్లా? మా పార్టీ కార్యకర్తలా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.