(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరని నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఎర్రబాలెం గ్రామంలో రైతుల దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భువనేశ్వరి తన చేతికి ఉన్న గాజులు తీసి అమరావతి ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా అర్థం చేసుకున్నానని అన్నారు. ఏపీని నంబర్ వన్ గా చేయడానికి చంద్రబాబు నిరంతర కృషి చేశారని తెలిపారు. రాత్రింబవళ్లు చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజల తర్వాతే.. తమ కుటుంబాన్ని పట్టించుకునేవారని, ఎప్పుడూ అమరావతి, పోలవరం అని చంద్రబాబు తపించారని చెప్పారు. ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారన్నారు. రైతులకు పూర్తి మద్దతుగా తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరని తెలిపారు.
టీడీపీప అధినేత చంద్రబాబు తన నూతన సంవత్సరం వేడుకలను రద్దు చేసుకొని ఇవాళంతా అమరావతి రైతుల మధ్యే గడపాలని నిర్ణయించుకున్నారు.
మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆప్రాంత రైతుల చేస్తున్న ఆందోళన నేటితో 15వ రోజుకు చేరింది. తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ప్రకాశం జిల్లాలో జేఏసీ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు.