న్యూఢిల్లీ: టిక్ టాక్ యాప్ కోసం వీడియో తీస్తూ.. ఓ యువకుడు తన స్నేహితుడిని కాల్చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఒక వాహనంలో జరిగింది. సల్మాన్ ముగ్గురు స్నేహితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై హత్య, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ మధుర్ వర్మ చెప్పారు. దీనిపై పోలీసులు మరిన్ని వివరాలు మాత్రం చెప్పలేదు. సల్మాన్ వాహనంలో ఏం జరిగిందన్న దానిపై విచారణ జరుపుతున్నామన్నారు.
ఆరోజు రాత్రి కొందరు స్నేహితులు సల్మాన్ ను పిలిచారని అతడి తండ్రి హాజీ షకీర్ చెప్పారు. తర్వాత రాత్రి 11.30 గంటలకు తన కొడుకు చనిపోయినట్లు పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందన్నారు. కాపాడాల్సిన స్నేహితులే తన కొడుకును చంపేశారని ఆయన ఆరోపించారు. రాత్రి 9 గంటల సమయంలో సల్మాన్ తన స్నేహితులతో వెళ్లాడని పోలీసులు చెప్పారు. తర్వాత కొంత సేపటికి లోక్ నాయక్ ఆసుపత్రి నుంచి ఒక యువకుడు తుపాకి గాయంతో తమ వద్దకు వచ్చినట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. అతడి స్నేహితుల్లో ఒకరు తీవ్ర రక్తస్రావం అవుతున్న సల్మాన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అతడిని ప్రశ్నించిన తర్వాత ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్టుచేసి పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.
సల్మాన్ తండ్రి లెదర్ జాకెట్ల వ్యాపారం చేస్తారు. వారం క్రితమే కూతురి పెళ్లి చేశారు. సల్మాన్ కూడా తన తండ్రికి వ్యాపారంలో సాయం చేసేవాడు. అతడిని ఆసుపత్రిలో చేర్చాక, స్నేహితులు అక్కడినుంచి వెళ్లిపోయారు. వారిని గుర్తించి అరెస్టుచేశారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.