నెలలో బీజేపీకి 160 గంటలు
కాంగ్రెస్ పార్టీకి 80 గంటలే..
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన దాదాపు నెల రోజులలో దూరదర్శన్ చానల్లో బీజేపీకి 160 గంటల ఎయిర్ టైం కవరేజి లభించింది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం సరిగ్గా అందులో సగమే వచ్చింది. ఈ వివరాలను ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక బయటపెట్టింది. ఏప్రిల్ 5వ తేదీన ఎన్నికల సంఘానికి డీడీ న్యూస్ అందించిన నివేదికలో అప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలకు అందించిన కవరేజి సమయాలను వెల్లడించింది. అందులో బీజేపీకి 160 గంటలు, కాంగ్రెస్ పార్టీకి 80 గంటలు, సీపీఎంకు 8 గంటల సమయం ఇచ్చినట్లు తెలిపింది. అయితే సమయాల కేటాయింపులో ఎక్కడా పొంతన లేదేమని ఏప్రిల్ 9న ఎన్నికల సంఘం అడిగింది. ఏ పార్టీకి అనుకూలంగా అదనపు సమయాలు కేటాయించకుండా డీడీని నిరోధించాలని సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు సూచించింది.
అయితే, బీజేపీకి లోక్ సభలో ఎక్కువ స్థానాలు ఉండటంతో పాటు 16 రాష్ట్రాలలో ఆ పార్టీ అధికారంలో ఉందని, కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదని.. దానికి అనుగుణంగానే సమయం కేటాయింపులు ఉన్నాయని దూరదర్శన్ అధికారి ఒకరు వివరించారు. బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి చూస్తే మొత్తం సమయంలో సరిగానే కేటాయించామని అన్నారు. ఈ వివరణ ఎన్నికల సంఘానికి చేరలేదని తెలిసింది. దూరదర్శన్ ఎన్నికల కవరేజి తటస్థంగా లేదని, అందరికీ సమానావకాశాలు ఇవ్వలేదని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది.
ఎన్నికల కవరేజి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, అది 30 టీవీ చానళ్లు, 100కుపైగా రేడియో స్టేషన్ల ద్వారా అవుతుందని ప్రసారభారతి సీఈవో వెంపటి శశి శేఖర్ అన్నారు. ఏదో కొంత సమయాన్ని మాత్రమే తీసుకుని విమర్శలు గుప్పించడం సరికాదని చెప్పారు. అయినా ఎన్నికల సంఘం చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దూరదర్శన్ బీజేపీకి అనుకూలంగా ఉంటోందని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 31న నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని 84 నిమిషాలు ప్రసారం చేసిందని ఆరోపించింది.