2018 ఆగస్టులో ఎన్డిటివి చేసిన స్టింగ్ ఆపరేషన్లో పెహ్లూను గంటన్నర సేపు కొట్టామని చెప్పిన విపిన్ యాదవ్
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పెహ్లూ ఖాన్ను గోరక్షక దళంగా చెప్పుకునే మూక కొట్టి చంపిన రెండేళ్లకే రాజస్థాన్లోని అల్వార్ సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. విచారణను ఎదుర్కొన్న నిందితులు ఆరుగురూ నిర్దోషులేనని తేల్చింది. 55 ఏళ్ల పెహ్లూ ఖాన్ను ట్రక్కులోనుంచి రోడ్డు మీదకు లాగి మూక రాక్షసంగా చావబాదుతుంటే తీసిన వీడియోను దేశమంతా చూసింది. కోర్టు మాత్రం ఆ వీడియోను సాక్ష్యంగా స్వీకరించేందుకు నిరాకరించింది. పెహ్లూ ఖాన్ను చావబాదటం కళ్ల ఎదురుగా కనబడుతున్నా అతనిని ఎవరు చంపారన్న ప్రశ్న మాత్రేం మిగిలింది.
పెహ్లూ ఖాన్ను చావబాదిన వారిలో ఒకడైన విపిన్ యాదవ్ను ఎన్డిటివి గత సంవత్సరం ఆగస్టులో స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. పెహ్లూ ఖాన్ను గంటన్నర పాటు కొట్టామని అతను గొప్పగా చెప్పుకున్నాడు. ఆ స్టింగ్ వీడియోను కూడా కోర్టు సాక్ష్యంగా తీసుకోలేదు. కోర్టు తీర్పు తర్వాత గర్వంగా బయటకు నడిచిన ఆరుగురిలో విపిన్ యాదవ్ ఒకరు.
కోర్టు తీర్పు తర్వాత నిర్దోషులుగా బయటకు నడుస్తున్న నిందితులు
పెహ్లూను కొడుతుండగా తీసిన వీడియో స్పష్టంగా లేదనీ, నిందితులు అక్కడ ఉన్నదీ లేనిదీ ఆ వీడియో ఆధారంగా నిర్ధారించలేమనీ న్యాయమూర్తి పేర్కొన్నారు. దానికి తోడు ఆ దారుణకృత్యాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించిన వ్యక్తి కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు రాలేదు. మరో వీడియో తీసిన వ్యక్తి ప్యాసిక్యూషన్కు ఎదురుతిరిగాడు. పెహ్లూను కొడుతుండగా తీసిన వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు కూడా పంపలేదు.
2017 ఏప్రిల్లో పశువులను ఒక వాహనంలో తీసుకువెళుతున్న పెహ్లూఖాన్ను ఢిల్లీ-జైపూర్ హైవేలో గోరక్షక దళం మూక ఆటకాయించి అతనిని విచక్షణారహితంగా కొట్టారు. మూడు రోజుల తర్వాత పెహ్లూఖాన్ ఆసుపత్రిలో మృతి చెందాడు. జైపూర్లో జరిగే ఒక సంతలో పెహ్లూఖాన్ పశువులను కొనుగోలు చేసి హర్యానాలోని స్వగ్రామం వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. పెహ్లూఖాన్తో పాటు ఉన్న అతని ఇద్దరు కుమారులు, మరో ముగ్గురిపై కూడా మూక దాడి చేశారు.
వీడియో ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి తొమ్మిది మందిపై కేసు పెట్టారు. వారిలో ముగ్గురు మైనర్ బాలురు. ఆ ముగ్గురూ బెయిల్పై బయట ఉన్నారు. వారు జ్యువనైల్ కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు.