న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తో ఆదేశాలు జారీ చేయించిన కేంద్రప్రభుత్వం జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని సంకల్పించింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సోమవారం రాజ్యసభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్ము కశ్మీర్ను విభజించడానికి ఉద్దేశించిన ఒక బిల్లును కూడా సభలో ప్రతిపాదించారు.
ఆ బిల్లు ప్రకారం లద్దాఖ్ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. మిగిలిన జమ్ము కశ్మీర్ కూడా కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంటుంది గానీ దానికి అసెంబ్లీ ఉంటుంది. లద్దాఖ్ మాత్రం అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది.
ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో నెలకొనిఉన్న శాంతి భద్రతల పరిస్థితి ప్రాతిపదికగా కేంద్ర పాలితప్రాంతం హోదా ప్రతిపాదిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. మంత్రి సభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం జమ్ము కశ్మీర్కు దేశ రాజధాని ఢిల్లీ తరహా కేంద్రపాలిత ప్రాంతం హోదా వస్తుంది. లద్దాఖ్ మాత్రం నేరుగా కేంద్రం పాలనలో ఉండే విధంగా రూపొందుతుంది.