న్యూఢిల్లీ: కెనడా పౌరుడైన అక్షయ్ కుమార్ ను భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలో ఎలా తీసుకెళ్తారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నాయకురాలు దివ్యస్పందన మండిపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన విమర్శలకు సమాధానంగా ఆమె ట్విటర్ లో ఈ ప్రశ్నలు వేశారు. ప్రధాని మోదీ కెనడా పౌరుడైన అక్షయ్ కుమార్ ను తనతో పాటు ఐఎన్ఎస్ సుమిత్రలో తీసుకెళ్లారని పోస్ట్ చేశారు. మనలో చాలామంది ఈ వివాదాన్ని మర్చిపోయామన్నారు. 2016 నాటి కథనాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ విమర్శ చేశారు.
https://twitter.com/divyaspandana/status/1126444665975201794
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1987లో ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను తన సొంత టాక్సీలా వాడుకుని విహార యాత్రకు వెళ్లారని ప్రధాని మోదీ ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో విమర్శించారు. తన స్నేహితులు, ఇటాలియన్ అత్తగారిని తనతో పాటు తీసుకెళ్లారని చెప్పారు. ఈ మేరకు ఇండియా టుడే పత్రిక 1988లో ప్రచురించిన కథనాన్ని కూడా ఆయన ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆయన ఆరోపణలను ఖండించింది. రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ లో అధికారికంగానే వచ్చారు గానీ, సెలవులో కాదని వైస్ అడ్మిరల్ వినోద్ పస్రిచా అనే రిటైర్డ్ నౌకా దళాధికారి చెప్పారు. ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారాలకు వైమానికదళ జెట్ విమానాలను సొంత టాక్సీలా వాడుకున్నారని, కేవలం రూ. 744 మాత్రమే దానికి చెల్లించారని కాంగ్రెస్ ఆరోపించింది. అక్షయ్ కుమార్ ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసిన తర్వాతి నుంచి అతడి పౌరసత్వ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయంలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అక్షయ్ కు అండగా నిలిచారు.