న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో ఫేక్న్యూస్ను అరికట్టేందుకు ఫేస్బుక్ రంగంలోకి దిగుతోంది. తమ ప్లాట్ఫాంను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకోబోతోంది. ఇందుకోసం ఢిల్లీలో ఏకంగా ఒక వార్ రూంను ఏర్పాటుచేయాలని తలపెడుతోంది. ఎన్నికల కంటెంటును పర్యవేక్షించేందుకు ఇది 24×7 పనిచేస్తుంది. కాలిఫోర్నియా, డబ్లిన్, సింగపూర్ లలో ఉన్న ఫేస్బుక్ కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటుంది. ఈ విషయాన్ని ఫేస్బుక్ ఇండియా, దక్షిణాసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్ తెలిపారు. ఎన్నికల కమిషన్ విధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా తమ ప్లాట్ఫాం ఉండబోతోందని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పరస్పర నిందారోపణలు, తప్పుడు సమాచారానికి తమ ప్లాట్ఫాంను వాడుకోకుండా చూస్తామని స్పష్టం చేశారు.
మన దేశంలో ఎన్నికల సమయంలో ఫేస్బుక్ దుర్వినియోగం ఎక్కువగా ఉంటోందని, అయినా యాజమాన్యం మాత్రం దాన్ని నిరోధించలేకపోతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు వార్ రూం ఏర్పాటుతో అమెరికా తర్వాత అలాంటిది ఉండటం ఇదే ప్రథమం. అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది, పనెప్పుడు మొదలవుతుంతో మాత్రం ఇంకా చెప్పలేదు. కానీ అమెరికా ఎన్నికల్లో పనిచేసినట్లే ఇక్కడా అది చేస్తుందని తుక్రాల్ చెప్పారు. కంటెంట్, పాలసీ, లీగల్ లాంటి అనేక విభాగాలను పరిశీలించి, ఈసీతో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. ఇందుకు రకరకాల బృందాలు ఉండనున్నాయి. ఎన్నికల విషయంలో ఫేస్బుక్ ఇప్పటికే తన పని ఉధృతం చేస్తోంది. 40 బృందాలు ఇందుకోసం పనిచేస్తున్నాయి. కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఇది మొదలైంది. ఇప్పుడు లోక్సభతోపాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలుండటంతో దీన్ని మరింత బలోపేతం చేయనున్నారు.
ఏం చేస్తుంది?
తప్పుడు సమాచారాన్ని పంపే ఫేక్ అకౌంట్లను తీసేయడం దీని మొట్టమొదటి పని. 2017 సెప్టెంబరు నుంచి 2018 అక్టోబరు మధ్య 200 కోట్ల ఫేక్ అకౌంట్లను తీసేశామని చెబుతోంది. ఇందుకోసం మెషీన్ లెర్నింగుతో పాటు మనుషులతోనూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఫేక్న్యూస్ వైరల్ కాకుండా చూడటం మరో పని. తమది టెక్నాలజీ ప్లాట్ఫాం తప్ప వాస్తవాలు తేల్చేది కాదని, అందువల్ల తప్పుడు వార్తలను గుర్తించేందుకు స్వతంత్ర సమీక్షకులను నియమిస్తున్నామని చెబుతోంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, బెంగాలీ, మళయాళం, మరాఠీలలో వాస్తవాల గుర్తింపునకు వివిధ సంస్థలతో కలిసింది. వీటిలో ఇండియాటుడే నుంచి విశ్వాస్.న్యూస్ లాంటివి చాలా ఉన్నాయి.
ప్రకటనల్లోనూ పారదర్శకత
వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనల్లో కూడా పారదర్శకత ఉండేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు తుక్రాల్ చెప్పారు. ప్రకటన ఇచ్చేది ఎవరు, దానికి డబ్బు చెల్లించేది ఎవరో కూడా అందులో చెప్పాలి. దాంతోపాటు యాడ్ లైబ్రరీలో అన్నీ పెడతారు. యూజర్లు వాటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ప్రకటన ఇచ్చిన వ్యక్తి వయసు, ఆడా.. మగా, ఎక్కడినుంచి ఇచ్చారో కూడా ఇందులో తెలుస్తుంది. ప్రకటనలకు ఎక్కువగా ఖర్చుపెట్టేది ఎవరన్న విషయాన్ని కూడా వారానికోసారి తెలియజేస్తామని తుక్రాల్ తెలిపారు.