లండన్ రాయల్ సొసైటీలో తొలిసారి సభ్యత్వం
ఆకాశంలో సగం అనే మహిళలు తారాపథంలో దూసుకుపోతున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. లండన్ రాయల్ సొసైటీ ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రముఖులైన 51 మంది శాస్త్ర్రవేత్తలను ఫెలోలు, విదేశీ సభ్యులుగా ఎంపిక చేసింది. వారిలో భారతీయ క్లినీషియన్ శాస్త్రవేత్త గగన్ దీప్ కాంగ్, మరో ముగ్గురు భారత సంతతి శాస్త్రవేత్తలు ఉన్నారు. అమెరికన్ – కెనడియన్ గణితవేత్త మంజుల్ భార్గవ, ఆస్ట్రేలియా గణితవేత్త అక్షయ్ వెంకటేశ్, బ్రిటిష్ మైక్రోబయలాజిస్టు గుర్ దయాళ్ బెస్రాలకూ ఈ గౌరవం దక్కింది.
రాయల్ సొసైటీలో ఫెలోగా ఎంపికైన మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త గగన్ దీప్ కాంగ్. ఇంతకుముందు బ్రిటిష్ మైక్రోస్కోపిస్టు ప్రతిభా గాయ్ (2016), అమెరికన్ మైక్రోబయలాజిస్టు లలితా రామకృష్ణన్ (2018) ఈ గౌరవం పొందినా, వారు భారతసంతతి వారే తప్ప పూర్తిగా భారతీయులు కారు. కాంగ్ తమిళనాడులోని వెల్లూరులో గల ప్రఖ్యాత క్రిస్టియన్ మెడికల్ కాలేజి (సీఎంసీ-వెల్లూరు)లో క్లినీషియన్ శాస్త్రవేత్త, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ శాఖలో ప్రొఫసర్. దాంతోపాటు, ఫరీదాబాద్ లోని ట్రాన్స్ లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కూడా ఉన్నారు. ఇది కేంద్ర బయోటెక్నాలజీ, మంత్రిత్వశాఖ కింద స్వతంత్ర సంస్థ.
‘‘రాయల్ సొసైటీ సైన్స్ పరిశోధన రంగంలో ఉన్నత ప్రమాణాలతో కూడుకున్నది. భారతదేశంలో శిక్షణ పొందిన వైద్య పరిశోధకురాలిగా అందులో సభ్యత్వం రావడం చాలా గర్వకారణం. రెండేళ్లు తప్ప నా జీవితమంతా భారతదేశంలోనే గడిచింది. నేను, నా పరిశోధక బృందం కలిసి చేసిన పనికి, దాని నాణ్యతకు, ప్రభావానికి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని గగన్ దీప్ తెలిపారు. పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్లపై ఆమె పరిశోధన సాగింది. భారతదేశంలో పిల్లల మరణాలకు ఎక్కువ కారణం అవుతున్న రోటావైరస్ ఇన్ఫెక్షన్లపై ఆమె పరిశోధించారు. రోటావైరస్ ఇన్ఫెక్షన్లకు తట్టుకునే శక్తి భారతీయులకు తక్కువని ఆమె నిరూపించారు. మిగిలిన ప్రపంచంలో బాగా పనిచేస్తున్న వ్యాక్సిన్లు ఇక్కడ పనిచేయకపోవడానికి కారణం ఆమె కనిపెట్టారు. పలు దేశాలలోని శాస్త్రవేత్తలు, టీకాల తయారీదారులకు ఆమె శిక్షణ ఇస్తుంటారు.