లక్నో: ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసినందుకు ఎన్నికల కమిషన్ 72 గంటల నిషేధం విధించినా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ బుద్ధి మారలేదు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఒకరిని ఆయన ‘బాబర్ కీ ఔలాద్’ (బాబర్ సంతానం) అన్నారు. సంభల్ జిల్లాలో ఒక ర్యాలీలో యోగి మాట్లాడారు.
‘‘ సమాజ్ వాదీ పార్టీలో పార్లమెంటు సభ్యులు ఎలాంటి వాళ్లు వస్తారో తెలుసా.. పార్లమెంటులో ఒకసారి నేను కూర్చుని ఉన్నాను. పక్కనే సంభల్ నుంచి సమాజ్ వాదీ ప్రస్తుత ఎంపీ ఉన్నారు. మీ పూర్వీకులు ఎక్కడివారని ఆయనను నేను అడిగాను.. బాబర్ వారసులమని ఈ పెద్దమనిషి చెప్పారు’’ అన్నారు. సంభల్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరఫున షఫీక్ ఉర్ రెహమాన్ బుర్ఖ్ పోటీ చేస్తున్నారు. దేశ పగ్గాలను అభివృద్ధి నిరోధకులు, యువతకు వ్యతిరేకులు, మోసగాళ్లు, ఉగ్రవాదులు, బజరంగబలి భక్తులకు వ్యతిరేకుల చేతుల్లో పెడతారా అంటూ ప్రజలను యోగి అడిగారు.
‘‘ఒకవైపు దేశానికి గౌరవాన్ని తెచ్చిపెడుతున్న మోదీజీ.. కానీ రెండోవైపు తమను తాము బాబర్ వారసులం అని చెప్పుకొనే వ్యక్తి మహాకూటమి అభ్యర్థిగా ఉన్నారు. దేశద్రోహుల చేతుల్లోకి దేశ పగ్గాలను మీరు అప్పగిస్తారా.. ఉగ్రవాదుల చేతుల్లో పగ్గాలు పెట్టేస్తారా.. బాబార్ వారసులం అని తమను తాము చెప్పుకొనేవారికి.. బజరంగ బలి ద్రోహుల చేతుల్లో పగ్గాలు అప్పగిస్తారా?’’ అంటూ ప్రజలతో ఆదిత్యనాథ్ సంభాషించారు. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ ‘అండర్ వేర్’ వ్యాఖ్యలపైనా యోగి పండిపడ్డారు. ఆజం లాంటి వ్యక్తుల కోసమే తమ ప్రభుత్వం యాంటీ రోమియో బృందాలను పెట్టిందని చెప్పారు.