న్యూఢిల్లీ: భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆ దిశగా పనులు వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే తేజాస్ రైలును ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా మరో 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్కు లెటర్ రాశారు. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కార్యదర్శి స్థాయి సాధికార కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సీఈఓ ఛైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో రైల్వేబోర్టు ఛైర్మన్, కేంద్ర ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, రైల్వే ఫైనార్షియల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు.
దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఈ నేపథ్యంలో తొలి విడతలో 50 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ‘ఈ అంశంపై రైల్వే మంత్రితో విస్తారంగా చర్చించాం. కనీసం 50 రైల్వే స్టేషన్లు అయినా ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నాం. ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ప్రక్రియతో ఈ రైళ్ల నిర్వహణలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయి. తొలి దశలో 150 రైళ్లను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నాం’ అని అమితాబ్ కాంత్ తెలిపారు.
అక్టోబర్ 4న మొదలైన లక్నో-ఢిల్లీ మధ్య ప్రారంభమైన తేజస్ ఎక్స్ప్రెస్ దేశంలో తొలి ప్రైవేటు రైలు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుండగా… భోజన సదుపాయం, రూ.25 లక్షల దాకా ఉచిత బీమా సదుపాయం, రైలు ఆలస్యమైతే పరిహారం చెల్లింపు లాంటి పలు సదుపాయాలను ఇందులో కల్పిస్తున్నారు. ఈ కొత్త పథకాలతో ప్రయాణికులను ఆకర్షిస్తుంది.