“కలం కదలడం లేదు. మెదడు తట్టడం లేదు. కాలు నిలవడం లేదు. కానీ రాయలన్న ఆతృత ఆగడం లేదు. జరిగింది చెప్పాలన్న కసి తీరడం లేదు”…! ఎలా, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి తెలియక. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయేది, రాయబోయేది “గ్రానైట్” గురించి. దొంగలే దొరలుగా మారిన వైనం గురించి. దొరలై ఏలుతున్న విధానం గురించి. ఇదో జరిగిన, జరుగుతున్న సీక్వెల్ సినిమా. మూలల్లోకి వెళ్తే మలుపులుంటాయి, మర్మాలుంటాయి, మాయలుంటాయి, మర్చిపోలేని దారుణాలుంటాయి. ఓపికగా చదవండి. నిజాలు తెలుసుకుందాం…! ప్రకాశం జిల్లాలో గ్రానైట్ నిక్షేపాల తవ్వకాల్లో అవినీతి బాగోతం మొత్తం బయటపెట్టాలన్న ప్రయత్నమే “న్యూస్ ఆర్బిట్” చేస్తుంది. ఇక్కడ రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేదు.
ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ క్వారీలపై ప్రభుత్వం వరుసగా తనిఖీలు చేస్తుంది. మూడు, నాలుగు నెలల నుండి వందలాది మంది అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులు చూసారు, నేరుగా క్వారీల్లో కొలతలు తీశారు. లెక్కలన్ని పట్టుకున్నారు. మొత్తానికి రూ. 1914 కోట్లు అవినీతి జరిగిందని తేల్చారు. ఇంత సొమ్ము దొంగతనంగా తరలించారని, ప్రభుత్వానికి కట్టాల్సిందేనని క్వారీల యజమానులకు నోటీసులిచ్చారు. ఇది తాజా అంశం. ప్రస్తుతం నడుస్తుంది. ప్రభుత్వ పెద్దలు, క్వారీల యజమానులు మధ్య నలుగుతుంది. ఎక్కడ ఆగుతుంది? ఎటు వెళ్తుంది? అనేది స్పష్టత లేదు. ఈ అవినీతి నిజమేనా? జరిగిన అవినీతి ఇంతేనా? ఇంకా ఉందా? గతంలో ఎన్నడూ లేనిది ఇంతగా తనిఖీలు ఎందుకు జరిగాయి? అసలు ఏం జరుగుతుంది…? అనేది లోతుగా తెలుసుకోవాల్సి ఉంది.
గ్రానైట్ తవ్వకాల్లో అవినీతి నూటికి నూరుపాళ్లు నిజమే. మొత్తం అవినీతి బాగోతం తర్వాత కథనాల్లో చెప్పుకుందాం… ఇప్పుడు సింపుల్ గా చెప్పుకుంటే… చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్ తవ్వకాల్లో 50 శాతం…, బల్లికురవ, గురిజేపల్లి గ్రానైట్ తవ్వకాల్లో 80 శాతం వరకు అవినీతి జరుగుతుంది. ఒక క్యూబిక్ మీటర్ తవ్వితే ప్రభుత్వానికి రూ. 4600 చెల్లించాలి. చీమకుర్తిలో తవ్విన గ్రానైట్ కి క్యూబిక్ మీటర్ ధర బయట మార్కెట్ లో రూ. 20 నుండి 25 వేల వరకు పలుకుతుంది. అంటే రాయల్టీ చెల్లించగా, తవ్వకం, నిర్వహణ, చిల్లర ఖర్చులు పోనూ మిగిలింది జేబులో వేసుకోవచ్చు. కానీ గ్రానైట్ యజమానుల్లో అవినీతి ఏనాడో నిద్ర లేచింది. రాయల్టీ ఎగ్గొట్టేస్తే, మొత్తం జేబులో వేసుకోవచ్చన్న దురాశతో దందాలు ఏనాడు నుండో సాగిపోతున్నాయి. అందుకే తవ్వినదాంట్లో కొంత చూపిస్తారు. కొంత దొంగచాటున దారి మల్లిస్తారు. వాస్తవానికి అధికారులు ఇప్పుడు పట్టుకుంది చాలా తక్కువే. గ్రానైట్ లో అవినీతి మొత్తం బయటపెడితే “రైతు భరోసా” పథకానికి ఏడాది పాటు నిధులు వస్తాయి. ఇది ఏళ్ల తరబడి జరుగుతుంది.
కానీ… నిన్న, ఈ రోజు తిన్నది ఈరోజు కక్కమంటే అర్థం ఉంది. కానీ ఏడాది కిందట, పదేళ్ల కిందట తిన్నది కూడా ఇప్పుడు కక్కమంటే ఎలా? అసాధ్యం.
2000 శకం ఆరంభంలో సాధారణ చిల్లర దుకాణం నడుపుకుందమనుకున్న వ్యక్తి ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యారు. నాడు 7 ఎకరాల్లో వ్యవసాయం చేసుకునే వ్యక్తి కుటుంబం నేడు వందల కోట్లకు సంపద సృష్టించుకున్నారు. కొందరు భద్రంగా దాచుకున్నారు. కొందరు సినిమాల్లో, కొందరు వివిధ వ్యాపారాల్లో, కొందరు భూముల్లో, కొందరు రాజకీయాల్లో, కొందరు విలసాల్లో… ఇలా ఎక్కడ చూసినా గ్రానైట్ డబ్బులు పెట్టేసారు. అంతా ఇప్పుడు తీయండి, కొంత ప్రభుత్వానికి కట్టండి అంటే బాధేస్తుంది. ఏం చేయాలో తెలియక తలలు పీక్కుంటున్నారు.
రూ. 1914 కోట్లు కట్టాల్సిందేనని ప్రభుత్వం గట్టిగా చెప్తుంది. వామ్మో అంత కట్టలేం ఏదోటి చేయండి అంటూ క్వారీల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. “మీరు దోచుకుంది చాలు, మేము తవ్వుకుని మేమే చేసుకుంటాం, నడిపించుకుంటాం” అంటూ ప్రభుత్వ పెద్దల రాయబారం నడుస్తుంది. దీని ద్వారా గ్రానైట్ లో తమవార్ని దించాలని గుడ్డి ప్రయత్నిమో, లేక సంపద సృష్టించి పథకాలకు మళ్లించాలని మంచి ప్రయత్నమో అనేది ప్రభుత్వ పెద్దలకె తెలియాలి. లోలోపల మాత్రం కొందరిని క్వారీల నుండి తరిమేయాలని ప్రభుత్వ పెద్దల ఉద్దేశం దాగి ఉంది. దోచుకున్నది కక్కించి లేదా ఉన్నది ఉన్నట్టు విడిచిపెట్టి వదిలేసేలా చేయాలని మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని ద్వారా బాగా మరిగిన యజమానులు మాత్రం అయ్యా.. , బాబు రూ. 1914 కాదు కానీ, అందరం కలిసి రూ. 500, 600 కట్టేస్తాం మమ్మల్ని ప్రశాంతంగా చేసుకోని అంటూ రాయబేరాలు నడుపుతున్నారు. కోర్టుకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నా అక్రమ ఆయుధాలు బయటపెడితే బాధితులుగా మారిపోతాం అంటూ లోలోపల మధన పడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
శ్రీనివాస్ మానెం