న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ అంశంపై దాఖలయిన అన్ని పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఒక రోజుకు వాయిదా వేసింది. జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లపై విచారణ చేపడుతుంది.
సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ముందుకు ఈ పిటిషన్లు వచ్చినపుడు తమకు ఇన్ని పిటిషన్లు విచారించేందుకు సమయం లేదనీ, అయోధ్య కేసు విచారించాల్సిఉందనీ అన్నారు. కశ్మీర్ కేసులు విచారిస్తున్న బెంచ్లోని ప్రధాన న్యాయమూర్తి, ఆయనతో పాటు ఉన్న ఇద్దరు న్యాయమూర్తులూ అయోధ్య కేసు విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నారు.
ఆగస్టు అయిదవ తేదీ నుంచి కశ్మీర్లో తీవ్రమైన ఆంక్షలు అమలవుతున్నాయి. మరుసటి రోజున కేంద్రప్రభుత్వం జమ్ము కశ్మీర్కు స్వయంప్తతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటినుంచీ అక్కడ వందలాది మంది రాజకీయ నాయకులూ కార్యకర్తలూ గృహ నిర్బంధలోనో, జైళ్లలోనో ఉన్నారు.
జమ్ము కశ్మీర్కు ఆర్టికల్ 370 వర్తించకుండా చేయడంపై ధాఖలయిన పిటిషన్ సుప్రీంకోర్టు ముందు ఉంది. అక్కడ అమలవుతున్న నిర్బంధంపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. జర్నలిస్టుల కదలికలను పరిమితం చేస్తున్న ఆంక్షలను కూడా సవాలు చేశారు. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులన్నీ వింటుంది.
మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను కోర్టులో హాజరుపరచాలంటూ తమిళనాడుకు చెందిన రాజ్యసభ సభ్యుడు వైకో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను వినేందుకు కూడా ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారు. ఫరూఖ్ అబ్దుల్లా నిర్బంధాన్ని సవాలు చేయాలంటే పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద ఆ పని చేయాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఆగస్టు అయిదు నుంచీ ఫరూఖ్ అబ్దుల్లాను కారణం చెప్పకుండా గృహనిర్బంధంలో ఉంచారు. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలయిన తర్వాత పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద అరెస్టు చేశారు. ఈ చట్టం కింద అరెస్టు చేస్తే కోర్టులో విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకూ నిర్బంధించవచ్చు.