ఢిల్లీ మార్చి 5 : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) తో పొత్తు ఉండదని ప్రకటించిన కాంగ్రెస్పై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ సహాయం చేస్తుందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ మోది, అమిత్ షా ద్వయాన్ని ఓడించాలని దేశం మొత్తం కోరుకుంటున్న సమయంలో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చడానికి కాంగ్రెస్ సహకరిస్తోంది. బిజెపితో కాంగ్రెస్ రహస్య ఒప్పందం చేసుకుంది. ఈ అపవిత్ర పొత్తును తిప్పికొట్టేందుకు ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో బిజెపి, కాంగ్రెస్లను చిత్తుగా ఒడిస్తాం’ అని కేజ్రీవల్ ట్విటర్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో ఈ రోజు సమావేశమైన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆప్తో పొత్తు ఉండదని ప్రకటించారు.
ఢిల్లీలో బిజెపి క్వీన్స్వీప్ చేయకుండా నిరోధించేందుకు ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు అవసరమని కేజ్రీవాల్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పొత్తుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఢిల్లీలోని ఏడు సీట్లను కైవసం చేసుకుంది. అయితే ఆప్ కు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మద్దతు లభించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఢిల్లీలోని 70 స్థానాలకు 67 గెలుచుకుంది. కాంగ్రెస్ కి ఒక్క సీటు దక్కలేదు.