హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే తదుపరి సీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ దేశమంతా కేసీఆర్ వైపు.. రాష్ట్రంలోని యువత కేటీఆర్ వైపు చూస్తోందని అన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం కావడం సహజమేనన్నారు. ‘కేటీఆర్ విజన్ ఉన్న నేత. ఈ రోజో, రేపో, ఇంకో ఐదేళ్లు లేదా పదేళ్ల తర్వాత అయినా కేటీఆర్ సీఎం కావొచ్చు’ అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేటీఆర్ పార్టీలో ఉన్నారని, ఉద్యమంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. కేటీఆర్ ముక్కుసూటి మనిషి అన్నారు. కేంద్రం సరైన సహకారాలు అందకపోయినా.. కేసీఆర్, కేటీఆర్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు. జనవరి 30న కేసీఆర్ బహిరంగ సభ పెడతారని ఎవరు చెప్పారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఓ పత్రికలో వచ్చిన వార్త చూసి ప్రచారం చేయడం తగదని అన్నారు. మతం పేరుతో సమాజాన్ని, వ్యక్తులను విడదీయాలని చూస్తే టీఆర్ఎస్ సహించదని హెచ్చరించారు. కుల మతాల మద్య చిచ్చు పెట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. సెంటిమెంట్ను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
కేటీఆర్ను కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయనున్నారని కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. మున్సిపల్ ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరు అనే చర్చ చానాళ్లుగా జరుగుతోంది. పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆరే అని కొందరు అంటే.. మరికొందరు హరీష్ రావు పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ కీలక పాత్ర పోషించారని, అపారమైన రాజకీయ అనుభవం, చాణక్యత హరీష్ సొంతం అని అంటున్నారు. అందుకే.. కేసీఆర్ తర్వాత ఆ పొజిషన్ కి హరీష్ కరెక్ట్ గా సరిపోతారు అని పార్టీలో కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తరువాత కేటీఆర్కే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.