అమరావతి: ఏపీ రాజధానిపై మరో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన భేటీలో జీఎన్ రావు కమిటీ రిపోర్ట్పై చర్చించిన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం సమాచారశాఖ మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చించామని మంత్రి నాని తెలిపారు. రాజధాని పట్టణీకరణపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు. ఈ రిపోర్టు వచ్చాక ప్రభుత్వం ఏర్పాటు చేసే హైపవర్ కమిటీ పరిశీలించి.. అధ్యయనం చేసి నివేదిక వచ్చాక తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండు నివేదికలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి చెప్పారు. రాజధానిపై గత ప్రభుత్వం చేసిన తప్పులు మంత్రివర్గ ఉప సంఘం గుర్తించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయాలు ఉంటాయన్నారు. అమరావతి ప్రాంతంలో జరిగిన అవకతవకలపై మంత్రి మండలి ఉప సంఘం నివేదిక ఇచ్చినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. నైతిక విలువలు దిగజార్చే విధంగా, అప్పటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చేసిన తప్పులను మంత్రి వర్గ ఉపసంఘం కనుగొన్నదని వివరించారు. 2014 డిసెంబర్ ముందు జరిగిన భూముల కొనుగోళ్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో అవినీతి విచారణ కోసం.. న్యాయ నిపుణుల సలహా తీసుకొని సీబీఐ, సీఐడీ, లోకాయుక్తకు అప్పగించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని చాలా మంది సవాళ్లు చేశారని.. పాపం పండిన రోజు అంతా బయటపడుతుందన్నారు.
త్వరలో జరగనున్న పంచాయతీరాజ్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు తెలిపారు. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రామాయపట్నం పోర్టుకు అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం పోర్టు ముఖపరిధిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కొత్తగా 108 వాహనాలు కొనుగోలుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే 104 సేవల కోసం 621 కొత్త వాహనాల్ని కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాష్ట్రంలో 341 మార్కెట్ యార్డుల్ని శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్చబోతున్నట్లు తెలిపారు. పసుపు, మిర్చి, ఉల్లి, చిరు ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి డిపిఆర్ తయారీకి రైస్ నిర్మాణ సంస్థకు బాధ్యత అప్పగించనున్నట్లు మంత్రి చెప్పారు.