అమరావతి: దొనకొండా..అదెక్కడుంది అని ప్రశ్నించారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ. బొత్సా నేడు మరో సారి సంచలన వ్యాఖ్య చేశారు.రాజధానిపై రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో బొత్సా ఏమి మాట్లాడినా అది వివాదాస్పదం అవుతున్నాయి. అవి ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. వాటిపై విమర్శలు వస్తున్నాయి.
నేడు మీడియాతో మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబుకు జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ బినామీ అంటూ సంచలన వ్యాఖ్య చేశారు.అందుకే టిడిపి వాయిస్ను పవన్ వినిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరావతి నిర్మాణాలకు అదనంగా మూడు రెట్లు ఖర్చవుతుందని బొత్సా అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదని బొత్సా భరోసా ఇచ్చారు. అమరావతితో పాటు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని బొత్సా చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకువెళతామని బొత్సా పేర్కొన్నారు.
ఏపి రాజధానిని దొనకొండకు తరలిస్తారా అని మీడియా ప్రశ్నించగా దొనకొండా అదెక్కడుందని ఎదురు ప్రశ్నించారు. ఏపిలో సంక్షేమానికి సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికీ సిద్ధంగా ఉందని బొత్సా తెలిపారు. జగన్మోహనరెడ్డి నూరు రోజుల పాలనకు వంద మార్కులు వచ్చాయని బొత్సా పేర్కొన్నారు.