మహబూబ్నగర్, మార్చి 29: దశాబ్దాలుగా కుంభకోణాల మయంగా జరిగిన కాంగ్రెస్ కుటుంబ పాలన చూశారు, ఐదేళ్ల ఈ చౌకీదారు పాలన చూశారు, మీరు ఆలోచన చేసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని ప్రధాని నరేంద్ర మోది కోరారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మోది అటు కాంగ్రెస్ గత పాలన, తెలంగాణలో కెసిఆర్ (టిఆర్ఎస్) పాలనను తీవ్ర స్థాయిలో విమర్శించారు.
దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ వారసత్వ, స్వార్థరాజకీయాలు నడిపిందని మోది విమర్శించారు. అటు కాంగ్రెస్ గానీ, ఇక్కడ టిఆర్ఎస్ గానీ ప్రజల కోసం చేసింది ఏమీ లేదని మోది అన్నారు.
60 నెలల కెసిఆర్ పాలనను ప్రజలు చూసారు, పాలమూరులో ఎవరికి మేలు జరిగిందని ప్రశ్నించారు. కేసిఆర్ కుటుంబానికే మాత్రమే మేలుజరిగిందని విమర్శించారు. కుటుంబ రాజకీయాలకు ప్రతి రూపం కెసిఆర్ అని అన్నారు. పాలమూరు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆయన ఎంపి అయ్యారు. ఎమ్మెల్యే అయ్యారు. సిఎం అయ్యారు కానీ ఆ ప్రాంత అభివృద్ధికి ఆయన ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని ఆయన పాలన గాలికి వదిలివేశాడని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి నిర్వహిస్తే చాలా ఖర్చు తగ్గేది, ప్రజా ధనం దుర్వినియోగం అయ్యేది కాదని మోది అన్నారు. మోది తారాబలం ముందు కెసిఆర్ తారాబలం సరిపోదని జ్యోతిష్యుడు ఎవరో చెప్పాడని ఆయన స్వార్థంతో పాలన గాలికి వదిలివేసి ముందుగా ఎన్నికలకు వచ్చారని మోది విమర్శించారు.
నేడు కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ మతోన్మాద మజ్లీస్ పార్టీతో కలిసి పని చేస్తుందని మోది విమర్శించారు.
ఐదేళ్లలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశాం. దేశాన్నిఅన్ని రంగాల్లో ముందుకు తీసుకువేళుతున్నామని మోది చెప్పారు.
ఎన్డిఎ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చామని మోది స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అమలు అవుతున్న పథకాలకు కెసిఆర్ పేరు మార్చి ఆయన అమలు చేసినట్లుగా చెప్పుకుంటున్నారని మోది విమర్శించారు. పేరు చెప్పుకున్నా ఫరవాలేదు కానీ పేదవారికి మేలు జరగాలన్నదే తమ ఉద్దేశమని మోది స్పష్టం చేశారు.
మీరు ఓటు వేసేది ప్రధాన మంత్రి కోసం కాదు, కొత్త భారతం కోసం అని మోది అన్నారు. గతంలో అనేక హింసలు, విధ్వంసాలు జరిగాయని గుర్తు చేశారు.
దేశ ప్రజల గౌరవం, భద్రత కోసం ఎన్డిఎ ప్రభుత్వం పని చేస్తుందని మోది పేర్కొన్నారు.
‘ఐదేళ్లలో ఐదు కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, 98శాతం మరుగుదొడ్లు నిర్మించాం, రైల్వే లైన్ ఇచ్చాం, కేంద్ర విద్యాసంస్థలు ఇచ్చాం, జాతీయ రహదారులకు నిధులు ఇచ్చాం’ ఇలా అనేక పథకాలకు కేంద్రం నిధులు విడుదల చేశామని మోది వివరించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మోది అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంత మందికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చిందని ప్రశ్నించారు.
మీ సహకారంతో ఐదేళ్ల ప్రభుత్వాన్నిసమర్థవంతంగా నడిపానని మోది అన్నారు. కుంభకోణాల పాలన వల్ల కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో పరపతి కోల్పోయిందని మోది విమర్శించారు.
దమ్మున్న కాపలాదారు ఒక వైపు, కుంభకోణాలు, కుటుంబ పార్టీలు మరో వైపు ఉన్నాయి ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని మోది కోరారు.