న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల తరువాత దేశంలోని ప్రతిపక్షాలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్ ఎంపీ ఉదయన్రాజ్ భోంస్లే బీజేపీలో చేరారు. ఇటీవల ఎస్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన భోంస్లే.. శనివారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వ విధానం నచ్చే తాను బీజేపీలో చేరానని భోంస్లే తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానని చెప్పారు. ఫడ్నవిస్తో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతానని తెలిపారు. భోంస్లే పార్టీలో చేరడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.
देश और धर्म की रक्षा के लिए अपना सर्वस्व अर्पण कर स्वराज की स्थापना करने वाले छत्रपति शिवाजी महाराज के वंशज श्री उदयनराजे जी ने आज भाजपा की सदस्यता ग्रहण की।
मैं भाजपा के करोड़ों कार्यकर्ताओं की ओर से उदयनराजे जी का भाजपा परिवार में स्वागत करता हूं। pic.twitter.com/jg37ezH5eN
— Amit Shah (@AmitShah) September 14, 2019
ఉదయన్రాజ్ రాజీనామాతో ఎస్సీపీ, కాంగ్రెస్ శ్రేణులు విస్మయానికి గురయ్యాయి. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. సీనియర్ నేతలు ఇలా పార్టీని వీడటం నేతలను కలవరానికి గురిచేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయపాలైన అనంతరం ఇరు పార్టీలకు చెందిన చాలా మంది కీలక నేతలు బీజేపీకి గూటికి చేరారు. మరోవైపు భోంస్లే వ్యవహారంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ‘పార్టీ మారాలనుకున్న వారికి ఇదే నా శుభాకాంక్షలు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం సహజం. నా అనుభవంలో ఇలాంటివి చాలా చూశా’ అని పవార్ వ్యాఖ్యానించారు.