న్యూఢిల్లీ: ముంబైలోని ఆరే కాలనీలో చెట్ల నరికివేతను తక్షణమే నిలిపివేయాలి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరే కాలనీలో మెట్రో ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వృక్షాలను తొలగించడం వెంటనే నిలిపివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అరెస్టయిన పర్యావరణ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని సూచించింది. విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. సోలిసటర్ జనరల్ తుషార్ మెహతా మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.
ముంబై మెట్రో కార్ షెడ్ నిర్మాణం కోసం ఆరే కాలనీలో ఉన్న చెట్లను తొలిగిస్తున్న వైనంపై నగరంలో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. పలువురు విద్యార్థులను, సామాజిక కార్యకర్తలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో లా విద్యార్థుల బృందం ఆదివారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ను కలిసి తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై విచారణకు బెంచ్ను ఏర్పాటు చేస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన 29 మంది నిరసన కారులకు ముంబై కోర్టు ఆదివారం బెయిల్ మంజూరుచేసింది. ఆందోళనకారుల్లో విద్యార్థులు కూడా ఉన్నారు. మహిళలు, విద్యార్థినుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.
ఆరే కాలనీలో 2,700 చెట్లను కూల్చి, మెట్రో డిపో కోసం షెడ్ నిర్మించాలని ముంబై మెట్రో నిర్ణయించింది. మెట్రో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పర్యావరణ కార్యకర్తలు ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కోర్టు నుంచి అనుమతి లభించడంతో శుక్రవారం అర్థరాత్రి మెట్రో సిబ్బంది చెట్లను కూల్చేందుకు ప్రయత్నించారు. దాదాపు 200 చెట్ల వరకు అధికారులు కూల్చివేయగా ఇదే సమయంలో భారీ ఎత్తున స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. దీంతో సిబ్బంది వెనక్కి తగ్గి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నాన్-బెయిల్బుల్ కేసు నమోదుచేసి, అక్కడ 144 సెక్షన్ విధించారు. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి హానితలపెట్టే చర్యలను మానుకోవాలని ఉద్యమకారులు మండిపడుతున్నారు. వీరి వాదనకు శివసేన మద్దతు తెలిపింది. ఈ అంశంపై దాదాపు ఐదేళ్లుగా పర్యావరణ వేత్తలు, ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ మధ్య పోరాటం సాగుతోంది.