ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్రం విడుదలకు నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు నమో టివికి కూడా వర్తిస్తాయని ఎన్నికల కమిషన్ ఉన్నత అధికారి ఒకరు తెలిపినట్లు ఎన్డిటివి పేర్కొన్నది.
‘పిఎం నరేంద్ర మోది’ సహా రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఎలాంటి బయోపిక్లను ఎన్నికలు పూర్తయ్యేవరకూ విడుదల చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
‘రాజకీయ పార్టీలకు గానీ, వ్యక్తులకు గానీ ప్రచారం చేకూర్చే ఏ బయోపిక్లూ థియేటర్లలో,ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించకూడదు’ అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో రేపు విడుదల కావాల్సిన ‘పిఎం నరేంద్ర మోది’ సినిమా నిలిచిపోయింది.
ప్రధాని నరేంద్ర మోది ఫొటోతో ఉన్న లోగోను కలిగిన ఈ నమో టివి మార్చి 31న ప్రారంభమైంది. ఈ ఛానల్ అన్ని డిటిహెచ్, కేబుల్ టివి ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంది. ఇందులో 24 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోది వివిధ ప్రాంతాల్లో చేస్తున్న ఎన్నికల ప్రసంగాల ప్రత్యక్ష ప్రసారాలను ఎప్పటికప్పుడు ఇస్తున్నారు.
అయితే ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో బిజెపికి అనుకూలంగా ఛానల్ లాంచ్ కావడం ఏమిటని విపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాయి. నమో టివి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు నమో టివి కూడా వర్తిస్తాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝా తెలిపారు. ‘అధికార పార్టీ ఇటువంటి చర్యలకు పాల్పడటం దేశానికి సిగ్గు చేటని’ సంజయ్ ఝా పేర్కొన్నారు.
దీనిపై బిజెపి కూడా స్పందించింది. ఈ ఛానల్ ఎన్నికల నియమావళిని ఉల్లంగించలేదని బిజెపి నేత వివేక్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రభుత్వానికి అసంతృప్తి కలిగిస్తుందని అనుకోవట్లేదు. ఈ ఛానల్ కేవలం ప్రభుత్వం, ప్రధాన మంత్రి సాధించిన విజయాలను చూపిస్తుంది. ఇది చట్టవ్యతిరేకమని ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. మేము ప్రత్యామ్నాయాలను చూస్తాము’ అని వివేక్ రెడ్డి వివరించారు.