Photo Courtesy: Ysr Congress party
అమరావతి: నవ్యాంధ్రలో ప్రజలు ఇచ్చిన తీర్పును వైసిపి ఆధినేత జగన్మోహన రెడ్డి కూడా బహుశా ఊహించి ఉండరు. తన విజయం గురించి ఆయనకు ఎప్పుడూ అనుమానం లేదు, తనను నిన్న మొన్న కలిసిన సన్నిహితులతో కూడా ఆయన 30 తేదీన ప్రమాణస్వీకారం అని చెప్పారు. అయితే గురువారం ఇవిఎంలను తెరిస్తే కనబడిన మద్దతు మాత్రం ఆయన ఊహల్లో కూడా ఉండిఉండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్కు బ్రహ్మరధం పట్టారు. కావాలి జగన్, రావాలి జగన్ అని ఆ పార్టీ సృష్టించిన స్లోగన్కూ జనం మనస్సుల్లో ఉన్న ఆకాంక్షకూ సరిపోయింది. వైసిపి గుర్తు ఫ్యాన్ ఇంత సునామీ ఎలా సృష్టించగలిగింది? టిడిపి పరాజయం పాలయినా మరీ ఇంత అవమానకరమైన ఓటమి ఎక్కడ ప్రాతిపదిక ఏర్పడింది?
ఈ సునామీ ఉధృతి తగ్గిన తర్వాత, పూర్తిగా వోటింగ్ సరళి తేలిన తర్వాత లోతైన విశ్లేషణలు ఎటూ వస్తాయి. ఇప్పటికిప్పుడు విశ్లేషించదలిస్తే మాత్రం జగన్కు ఒకసారి అవకాశం ఇవ్వాలన్న మాట జనంలో చొచ్చుకువెళ్లిందని చెప్పాలి. వైసిపికి ఎన్నికల సలహాదారుగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించింది.
ఎన్నికల ముందు జగన్ చేసిన పాదయాత్రను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల దూరం నడిచారు. దారిలో ఆయన పలకరించిన జనం, కలిసిన జనం ఎంతోకొంత ప్రభావితం కాకపోతే ఎన్నికలలో ఇలాంటి ఫలితం సాధ్యం కాదు. ప్రజప్రస్థానం పేరిట 2004 ఎన్నికల ముందు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలానే పాదయాత్ర చేసి కాంగ్రెస్ను గెలిపించారు. 2009 సెప్టెంబర్లో హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించేనాటికి వైఎస్ విశేషమైన ప్రజాభిమానాన్ని గడించారు. తనకంటూ వ్యక్తిగతంగా ఒక వోటుబ్యాంకు తయారుచేసుకున్నారు. ఆ అభిమానం చాలావరకూ చెక్కుచెదరకుండా ఉందని ఈ విజయం ద్వారా అర్ధమవుతున్నది.
అటు అధికారం నిలుపుకోవడానికి పోరాడిన చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి కూడా ఎంతోకొంత జగన్ విజయానికి తోడ్పడింది. గత అయిదేళ్లలో టిడిపి శాసనసభ్యులు కొందరు విపరీతంగా అవినీతికి పాల్పడిన విషయం ప్రజలలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు కూడా దానిని అరికట్టలేకపోయారు. ఎమ్మెల్యేలు మూటకట్టుకున్న అవినీతి ఎన్నికలలో ఇబ్బంది కలిగిస్తుందని ఆయన ఊహించారు. అందుకే తనను చూసి వోటు వేయాలని ఆయన ప్రజలను ప్రచారంలో కోరారు. ప్రజలు అందుకు సిద్దంగా లేరని రుజువయింది. టిడిపి హయాంలో కొన్ని సామాజిక వర్గాలు ఆ పార్టీకి దూరమ్యయాయి. ఒకే సామాజికవర్గం పెత్తనం ఎక్కువ అయిందన్న భావన క్రమేపీ బాగా బలపడింది. ఇటీవలి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్లో టిడిపి అభ్యర్ధులకు వ్యతిరేకంగా అన్నిసామాజికవర్గాలూ ఏకం అయ్యాయి. ఇప్పుడు ఎపిలో కూడా దాదాపుగా అదే జరిగిందని ఆనుకోవాలి. పసుపు కుంకుమ వంటి పధకాలు గట్టెక్కిస్తాయన్న ఆశ కూడా గల్లంతవడం చూస్తే మరోటి అనుకునేందుకు లేదు.
జనసేన స్థాపించి రంగంలోకి దిగిన సినీస్టార్ పవన్ కల్యాణ్ ఎవరి వోట్లు చీలుస్తారన్న విషయమై చాలా చర్చ జరిగింది. టిడిపితో పాటు వైసిపికి కూడా జనసేన వల్ల నష్టం ఉంటుందని చాలామంది భావించారు. కానీ టిడిపికే నష్టం జరిగినట్లు కనబడుతోంది. ఏయే సీట్లలో ఎంతమేరకు అనేది వోటింగ్ వివిరాలు వచ్చిన తత్వాత మాత్రమే తేలుతుంది. మొత్తం మీద వైసిపి గుర్తు ఫ్యాన్ నవ్యాంధ్రలో సునామీ సృష్టించింది.