ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు ఆహ్వానించాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. ‘కర్తార్పూర్ కారిడార్ ఓపెనింగ్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది పాక్కు ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఆహ్వానించాలని భావిస్తున్నాం. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రికను పంపించబోతున్నాం’ అని ఖురేషీ అన్నారు. మన్మోహన్ సింగ్ ను సిక్కు వర్గానికి ప్రతినిధిగా భావిస్తున్నామని, ఆయనకు త్వరలోనే ఆహ్వాన పత్రిక పంపిస్తామని తెలిపారు.
సిక్కుల గురువైన గురు నానక్ 550వ జయంతి ఉత్సవాలు నవంబర్లో జరుగనున్నాయి. పాకిస్థాన్ లోని దర్బార్ సాహిబ్ ను పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ గురుద్వారాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్ ను భారత్, పాకిస్థాన్ నిర్మిస్తోంది. ఇరు దేశాల్లోని సిక్కులు ఆ పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు వీలుగా కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా నవంబర్ లో కారిడార్ను ప్రారంభించనున్నారు.