(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కశ్మీర్లో ఇండియా తీసుకున్న చర్యలపై చర్చించేందుకు సమావేశం కావాల్సిందిగా ఐక్యరాజ్యమితి భద్రతా మండలిని పాకిస్థాన్ మంగళవారం కోరింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేస్తూ ఆగస్టు అయిదున నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేశారు కూడా. అప్పటి నుంచీ ఆ రాష్ట్రంలో తీవ్ర నిర్బంధం అమలులో ఉంది.
పాకిస్థాన్ రెండు దేశాల మధ్యా యుద్ధం వచ్చే పనేదీ చేయదనీ, అయితే తమ సహనాన్ని ఇండియా బలహీనతగా పరిగణించరాదనీ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ భద్రతా మండలికి రాసిన లేఖలో పేర్కొన్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఇండియా మళ్లీ బలప్రయోగం చేసినట్లయితే పాకిస్థాన్ శక్తి మేర ఎదురుదెబ్బ తీస్తుందని ఖురేషీ హెచ్చరించారు. ప్రమాదకరమైన ఈ పరిస్థితుల దృష్ట్యా భద్రతా మండలి వెంటనే సమావేశమై చర్చించాలని పాక్ మంత్రి కోరారు.
పాకిస్థాన్ విజ్ఞప్తికి భద్రతా మండలి ఎలా స్పందించేదీ ఇంకా స్పష్టం కాలేదు. భద్రతా మండలి సమావేశం కావాలంటే సభ్యదేశాల్లో ఏదోఒకటి దరఖాస్తు చేసుకోవాలా లేదా అన్నది కూడా తెలియదు. ఈ విషయంలో తమకు చైనా మద్దతు ఉందని పాకిస్థాన్ శనివారం పేర్కొన్నది.