సుప్రియా సూలేకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు: పవార్
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
పూనే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో కలిసి పని చేద్దామని ప్రతిపాదించినట్లు ఎన్సిపి నేత శరద్ పవార్ పేర్కొన్నారు. అయితే తాను రాజకీయపరంగా అది సాధ్యం కాదని తిరస్కరించినట్లు ఆయన తెలిపారు.
తన అన్న కుమారుడు అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం బిజెపితో చేతులు కలపడానికి మూడు రోజుల ముందు శరద్ పవార్ ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిశారు. ఆ సమావేశంలో మోదీ ఈ విధంగా ప్రతిపాదించారని శరద్ పవార్ ఒక టివి ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఎబిపి మఝా ఛానల్ సోమవారం సాయంత్రం ఆ ఇంటర్వ్యూ ప్రసారం చేసింది. మోదీ భారత రాష్ట్రపతి పోస్టు ఇవ్వజూపారా అని ప్రశ్నించగా, అది కరక్టు కాదు. అయితే సుప్రియా సూలేకు కేంద్రమంత్రి పదవి ఇస్తామన్నారు. మహారాష్ట్రలో బిజెపి, ఎన్సిపి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామన్నారు అని శరద్ పవార్ తెలిపారు.
తాను మహారాష్ట్ర రైతుల సమస్య గురించి చర్చించేందుకే మోదీ దగ్గరకు వెళ్లానని పవార్ చెప్పారు. ఆ విషయంపై మాట్లాడిన తర్వాత తాను వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మోదీ ఆగమన్నారనీ, కలిసి పనిచేద్దామంటూ ప్రతిపాదించారనీ శరద్ పవార్ తెలిపారు. పరిశ్రమలు, రైతుల సమస్యలు, అభివృద్ధి వంటి జాతీయ అంశాలపై రెండు పార్టీల వైఖరి ఒకటే అయినపుడు కలిసిపని చేయడానికి ఏం అభ్యంతరమని మోదీ ప్రశ్నించారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై ఏకాభిప్రాయం ఉన్నా రాజకీయంగా కలవడం సాధ్యం కాదని మోదీకి చెప్పినట్లు పవార్ తెలిపారు.
పవార్ ఇంటర్వ్యూ ప్రసారం అయిన తర్వాత బిజెపి నాయకుడు సుధీర్ ముంగంటివార్ స్పందిస్తూ, ఇద్దరు నాయకుల మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు వెల్లడి కావడం దురదృష్టకరమని అన్నారు. పవార్ చెప్పిన మాటలను తాను ఖండించడం కానీ ధృవీకరించడం కానీ చేయనని ఆయన పేర్కొన్నారు.