అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో గత టిడిపి ప్రభుత్వ హయాంలో అంచనాలు పెంచి వారికి అనుకూలమైన వారికి దోచి పెట్టారని ఆరోపిస్తూ వచ్చిన వైసిపి ప్రభుత్వం అందుకు ఆధారాలు చూపే క్రమంలో తొలి విజయం సాధించింది. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే వైసిపి నేతలు మేఘా ఇంజరింగ్ కంపెనీపై ఒత్తడికి తీసుకువచ్చి లెస్ టెండరింగ్ వేయించారనీ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆ కంపెనీకి వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్తో పాటు వాటర్ గ్రిడ్ పనులు కూడా అప్పగించేందుకు పథక రచన చేశారనీ టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల నాసిరకం పనులతో ఈ భారీ ప్రాజెక్టు భద్రతకు ముప్పు ఏర్పడితే ఉభయ గోదావరి జిల్లాలూ ప్రమాదానికి గురయ్యే అవకాశముందని వారు అంటున్నారు.
పోలవరం జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి కాంట్రాక్టు రద్దును సవాలు చేస్తున్న పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. పనుల రద్దుపై నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయడంతో అక్కడ వాదనలు జరుగుతున్నాయి.
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, పోలవరం ప్రాజెక్టు అధారిటీ కూడా పోలవరంలో రివర్స్ టెండరింగ్కు వెళ్లవదని సూచించినా వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే రివర్స్ టెండరింగ్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లింది.
పోలవరం హెడ్ వాటర్ వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం పనులకు మేఘా సంస్థ 12.6 శాతం తక్కువకు బిడ్ కోట్ చేసి ఎల్ 1 గా నిలిచింది. ఈ పనులకు 4,987 కోట్ల రూపాయలు ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువగా ప్రభుత్వం నిర్ణయించగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ 4,358కోట్ల రూపాయలకు పనులు పూర్తి చేస్తామని ముందు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు 629 కోట్ల రూపాయలు ఆదా అవుతోందని వైసిపి ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. ఇదే విధంగా పోలవరం 65వ ప్యాకెజీ పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్ టెండరింగ్ వల్ల 58.53 కోట్ల రూపాయలు ఖజానాకు అదా అవుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. ఈ నిర్ణయాల కారణం కారణంగా ప్రభుత్వానికి దాదాపు 750 కోట్ల రూపాయల ఆదా అవుతున్నదని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ పేర్కొంటున్నారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే రివర్స్ టెండరింగ్ నిర్వహించాలంటే కనీసం రెండు కంపెనీలైనా బిడ్లు దాఖలు చేసి ఉండాలి. ఈ విషయం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జివో నెం.67లో పేర్కొన్నది. ప్రభుత్వానికి మేలు జరుగుతున్నందున మేఘా సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసినప్పటికీ నిబంధనలు సడలించి పనులు అప్పగించవచ్చని పోలవరం ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. మేఘా సంస్థకు పనులు కేటాయించవచ్చని పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరింగ్ ఇప్పటికే జలవనరుల శాఖకు సిఫార్సు చేశారు. అయితే కోర్టు తీర్పు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను కేంద్రమే చేపట్టి పూర్తి చేయాలని రాష్ట బిజెపి నేతలు మరో పక్క డిమాండ్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్పై ప్రధాన ప్రతిపక్ష నేతల ఆరోపణలు, బిజెపి నేతల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.